న్యూఢిల్లీ : ఆయిల్ రిఫైనింగ్, బంకులు , పెట్రో కెమికల్ బిజినెస్లలో వచ్చే ఐదేళ్లలో రూ.1.7 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) చైర్మన్ జీ కృష్ణకుమార్ శుక్రవారం పేర్కొన్నారు. ‘ప్రాజెక్ట్ ఏస్పైర్’ పేరుతో ఐదేళ్ల స్ట్రాటజిక్ ఫ్రేమ్ వర్క్ను కంపెనీ రెడీ చేసింది. ఆయిల్ రిఫైనింగ్ కెపాసిటీని పెంచడం, గ్రీన్ ఎనర్జీ బిజినెస్ను విస్తరించడంపై బీపీసీఎల్ ఫోకస్ పెట్టింది. ఈ రూ.1.7 లక్షల కోట్లలో రూ.75 వేల కోట్లు రిఫైనరీస్, పెట్రోకెమికల్ బిజినెస్లలో ఇన్వెస్ట్ చేస్తామని కృష్ణకుమార్ అన్నారు.
రూ.8 వేల కోట్లతో పైప్లైన్ ప్రాజెక్ట్లను డెవలప్ చేస్తామని, ఇందులో రూ.5 వేల కోట్ల విలువైన ప్రాజెక్ట్లను ఇప్పటికే గుర్తించామని వివరించారు. ఫ్యూయల్ మార్కెటింగ్ బిజినెస్లో రూ.20 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామన్నారు. మొజాంబిక్, బ్రెజిల్లోని అప్స్ట్రీమ్ ప్రొడక్షన్ కోసం ఇప్పటికే రూ.32 వేల కోట్లు పెట్టుబడి పెట్టామని తెలిపారు. గ్యాస్ బిజినెస్లో రూ.25 వేల కోట్లు, గ్రీన్ ఎనర్జీ బిజినెస్లో రూ.10 వేల కోట్లు ఇన్వెస్ట్ చేస్తామని కుమార్ వివరించారు.
