- హైకోర్టు తీర్పు
హైదరాబాద్, వెలుగు : ఇంటర్మీడియెట్ బోర్డు మెడికల్ లేబొరేటరీ టెక్నిషియన్ (ఎంఎల్టీ), బ్రిడ్జి కోర్సులు పూర్తి చేసిన వారు ఫార్మసిస్ట్లుగా నమోదుకు అర్హులేనని హైకోర్టు తీర్పు చెప్పింది. పిటిషనర్లు 18 మందిని ఫార్మసిస్ట్లుగా నమోదు చేయాలని తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్కుమార్ జూకంటి ధర్మాసనం ఇటీవల తీర్పు చెప్పింది. ఎంఎల్టీ, బ్రిడ్జి కోర్సులకు ఆమోదం లేదని ఏపీ ఫార్మసీ కౌన్సిల్కు ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లేఖ రాయడాన్ని తప్పుపట్టింది.
ఇంటర్మీడియెట్ ఎడ్యుకేషన్ ఒకేషనల్ బోర్డు జారీ చేసిన ఎంఎల్టీ, బ్రిడ్జి కోర్సులకు ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్ 5(5) ప్రకారం ఆమోదం లేదని ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2011లో ఏపీ ఫార్మసీ కౌన్సిల్కు లేఖ రాసింది. ఫార్మసీ డిప్లోమా కోర్సులో ఇంటర్మీడియెట్ (ఒకేషనల్ కోర్స్) అర్హత ఉన్న అభ్యర్థులు ఎవరినీ చేర్చుకోవద్దంది. దీంతో జేఎన్టీయూలో బీ ఫార్మసీకి అర్హత పొందిన ఒకేషనల్ విద్యార్థులను ఫార్మసిస్ట్లుగా నమోదు చేసేందుకు ఏపీ ఫార్మసీ కౌన్సిల్ నిరాకరించింది. దీనిపై 18 మంది వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. పిటిషన్ల విచారణ అనంతరం హైకోర్టు పైవిధంగా తీర్పు చెప్పింది.