బ్రిటీష్ వారి నుంచి మనకు పరిచయమైన రుచులు

బ్రిటీష్ వారి నుంచి మనకు పరిచయమైన రుచులు

బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని రెండు వందల ఏండ్లకుపైనే పరిపాలించారు. 1947లో తిరిగి వెళ్తూ.. ఎన్నో గుర్తులను ఇక్కడ వదిలేశారు. మన ఆహార అలవాట్లు, కల్చర్‌‌‌‌ నుంచి రాజ్యాంగం వరకు అన్నింటిలోనూ వాళ్ల మార్క్‌‌ కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మన ఫుడ్‌‌పై బ్రిటిషర్ల ఎఫెక్ట్‌‌ ఇప్పటికీ  ఉంది. అంతేకాదు విదేశీయులు మనల్ని పాలించడం వల్ల మనదేశంలో కొత్త వంటకాలు కూడా పుట్టుకొచ్చాయి. 

కొన్ని వందల ఏండ్ల పాటు మనల్ని విదేశీ రాజులు పాలించడంతో ఆ ప్రాంతాల ఎఫెక్ట్ కూడా మన ఫుడ్‌‌ మీద పడింది. కాకపోతే బ్రిటిషర్ల ఎఫెక్ట్‌‌ కాస్త ఎక్కువగా ఉంది. మసాలాల వాడకం నుంచి  ఇప్పుడు మనం తింటున్న కూరగాయలు, పండ్ల వరకు అన్నింటిపై వాళ్ల ఎఫెక్ట్‌‌ ఉందనే చెప్పాలి. అంతెందుకు మాంసం వండే విధానంలో కూడా మార్పు వచ్చింది. 

ఆంగ్లో-ఇండియన్ వంటకాలు

మనదేశంలో బ్రిటిషర్స్‌‌ కాలంలోనే ఎక్కువగా ఆంగ్లో–ఇండియన్ వంటకాలు పుట్టాయి. ఈ వంటకాలకు ప్రజల నుంచి ఆదరణ వచ్చింది. బ్రిటిష్ వాళ్లు మన దేశానికి సముద్ర మార్గంలో వచ్చేవాళ్లు. వాళ్ల వెంట తెచ్చుకున్న కూరగాయలు, ఫుడ్‌‌ జర్నీలోనే అయిపోయేవి. వాళ్ల రెగ్యులర్ ఫుడ్‌‌లో భాగమైన ఆలుగడ్డలు, క్యారెట్లు, కాలీఫ్లవర్లు ఇక్కడ దొరికేవి కావు. దాంతో ఇండియన్ కూరగాయలతోనే వండుకునేవాళ్లు. కానీ.. మన రెసిపీలకు బ్రిటిష్‌‌ పద్ధతులు చేర్చి వండేవాళ్లు. ఆ తర్వాత కొన్నాళ్లకు వాళ్ల కూరగాయలను మన భూమిలో  పండించడం మొదలుపెట్టారు. అప్పుడు మనవాళ్లు ఆ కూరగాయలను మన స్టైల్‌‌లో వండడం మొదలుపెట్టారు. అలా ఆంగ్లో– ఇండియన్ ఫుడ్ పుట్టింది. ముఖ్యంగా 1757 నుండి 1857 మధ్య ఇలాంటి మార్పులు ఎన్నో వచ్చాయి. ఆ తర్వాత అవే కంటిన్యూ అయ్యాయి. 

మసాలా దినుసులు
బ్రిటిషర్లు రుచికరమైన వంటకం ఏది చేయాలన్నా మసాలాలు పడాల్సిందే. అందుకే వాళ్లు మసాలాల కోసం ఇండియాకు వచ్చారు. వాళ్ల వల్లే అనేక రకాల మసాలాలు మన వంటకాల్లో చేరాయి. మిరపకాయ, జాజికాయ, దాల్చిన చెక్క, లవంగాలు లాంటివన్నీ బ్రిటిష్‌‌ వాళ్ల వల్లే మనం వంటల్లో వేసుకోవడం మొదలుపెట్టాం. భారతీయ కుటుంబాలు మొదటగా వాటిని వంటల్లో వేయడానికి వెనకడుగు వేసినప్పటికీ తర్వాత అలవాటైపోయింది. వాటితో కొత్త కొత్త ప్రయోగాలు కూడా చేసేవాళ్లు మనవాళ్లు. 

కూరగాయలు
బ్రిటిష్‌‌వాళ్లు తీసుకొచ్చిన కూరగాయలను మనవాళ్లు ఎంతలా సొంతం చేసుకున్నారంటే.. ఇప్పుడు ఆ కూరగాయలు మనవి కావన్నా నమ్మలేరు. ముఖ్యంగా బ్రిటిష్‌‌ వాళ్ల వల్లే మన దేశానికి వచ్చిన ఆలుగడ్డలను ఎన్నో రకాల వంటల్లో వాడుతున్నాం. అంతెందుకు ప్రతి కూరలో వేసే టొమాటోలు కూడా బ్రిటీష్‌‌వాళ్లు తీసుకొచ్చినవే. ఏ కూర వండినా రెండు టొమాటోలు పడితే ఆ రుచే వేరు. ఇవే కాదు.. గుమ్మడికాయ, క్యారెట్లు, క్యాబేజీ, కాలీఫ్లవర్ కూడా ఒకప్పుడు భారత భూమికి విదేశీ కూరగాయలే. మొదట్లో బ్రిటిష్ అధికారులు ఈ కూరగాయలను వాళ్ల కిచెన్ గార్డెన్స్, లాన్స్‌‌లో పెంచుకునేవాళ్లు. వాళ్ల దగ్గర పనిచేసే ఇండియన్‌‌ సర్వెంట్స్‌‌కు వాటి రుచి నచ్చి, పొలాల్లో పండించుకోవడం మొదలుపెట్టారు. అయితే.. ఇప్పటికీ చాలామందికి ఈ కూరగాయల అసలు మూలం ఇంగ్లండ్‌‌ అనే విషయం తెలియదు.  

పండ్లు
యాపిల్‌‌, బొప్పాయి, దానిమ్మ, పైనాపిల్ లాంటి పండ్లు కూడా బ్రిటిష్ వాళ్ల వల్లే మన ఫుడ్‌‌ కల్చర్‌‌‌‌లోకి వచ్చాయి. బ్రిటిష్‌‌ వాళ్లే ఈ పండ్లను ఇండియాకి తీసుకొచ్చి, ఇక్కడ పెంచడం మొదలుపెట్టారు. వాళ్ల తోటల్లో పనిచేసేవాళ్లు వాటి విత్తనాలను తీసుకెళ్లి ఇంటి పరిసరాల్లో నాటుకునేవాళ్లు. ఎప్పుడూ చూడని పండ్లు, పైగా టేస్ట్‌‌ కొత్తగా ఉండడంతో వాటిని తినడానికి అలవాటు పడ్డారు. అలా ఈ పండ్లు మన కల్చర్​లో భాగమయ్యాయి. 

బేకరీ
బ్రిటీష్ వాళ్లు రాకముందు మనకు వివిధ రకాల పిండి వంటకాలు, పాలతో చేసే స్వీట్లు మాత్రమే తెలుసు. బేకింగ్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. కానీ.. బ్రిటిషర్లకు బేకింగ్‌‌ చేసిన బ్రెడ్లు, కేకులు తినే అలవాటు ఉండేది. దాంతో కొంతమంది ఇండియన్లకు బ్రెడ్లు, కేకులు చేయడంపై ట్రైనింగ్‌‌ ఇచ్చి, ఎక్కువ మంది బ్రిటిషర్లు ఉండే ప్రాంతాల్లో బేకరీలు పెట్టించారు. అలా మనకు బ్రెడ్లు, కేకులు తినడం అలవాటైంది. 

ఛాయ్‌‌
ఛాయ్‌‌ని మనకు పరిచయం చేసింది బ్రిటిషర్లే అయినా.. తేయాకు మాత్రం మనదే. కానీ.. చాలామందికి ఈ విషయం తెలియదు. బ్రిటిషర్లు రాకముందు నుంచే అస్సాంలోని అడవుల్లో, బీడు భూముల్లో తేయాకు చెట్లు బాగా పెరిగేవి. బ్రిటిషర్లు ఆ ప్లేసుల్లోనే టీ తోటలను ఏర్పాటు చేశారు. టీతో పాటు వాళ్లు కాఫీ, విస్కీ, జిన్ లాంటి ఆల్కాహాల్‌‌ కూడా ఇండియన్స్‌‌కి పరిచయం చేశారు.