9 మండలాలు.. 53 చోరీలు.. 53 కేసులు.. అన్నదమ్ముల దొంగతనాల చిట్టా

9 మండలాలు.. 53 చోరీలు.. 53 కేసులు.. అన్నదమ్ముల దొంగతనాల చిట్టా

భీమదేవరపల్లి, వెలుగు: అన్నదమ్ములు కలిసి మూడేండ్లుగా 9 మండలాల్లో 53 చోరీలు చేశారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ మూలమలుపు వద్ద పోలీసులు వెహికల్స్​తనిఖీ చేస్తుండగా, అనుమానస్పదంగా కనిపించడంతో వారిని ఎస్సై సాయిబాబా అదుపులోకి తీసుకొని విచారించగా దొంగతనాల చిట్టా బయటపడింది. సోమవారం పోలీస్ స్టేషన్​లో కాజీపేట ఏసీపీ పింగిలి ప్రశాంత్ రెడ్డి వివరాలు వెల్లడించారు. కరీంనగర్  జిల్లా సైదాపూర్ మండలానికి చెందిన బండి కుమారస్వామి, సతీశ్​ అన్నదమ్ములు. 

వీరిద్దరు కలిసి భీమదేవరపల్లి, వేలేరు, ధర్మసాగర్, చిల్పూరు, అక్కన్నపేట, హుజురాబాద్, శంకరపట్నం, ఎల్కతుర్తి మండలాల్లోని పంట పొలాల్లోని ట్రాన్స్​ఫార్మర్లను పగలగొట్టి కాపర్  వైర్, కరెంట్​ మోటార్లను ఎత్తుకెళ్లేవారు. కాపర్​ వైర్ ను భీమదేవరపల్లి మండలం ముల్కనూర్  గ్రామానికి చెందిన స్క్రాప్​ వ్యాపారి రుద్రాక్ష తిరుపతికి అమ్మారు. వారి నుంచి 250 కిలోల కాపర్​ వైర్, కరెంట్ మోటార్, బైక్​ స్వాధీనం చేసుకొని అన్నదమ్ములతో పాటు స్ర్కాప్​ వ్యాపారిపై కేసు నమోదు చేసినట్లు ఏసీపీ తెలిపారు.