
ఊట్కూర్, వెలుగు : ఇంటి బయట ఆడుకుంటున్న ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు నీటి సంపులో పడి చనిపోయారు. ఈ ఘటన నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తండాలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... తండాకు చెందిన పూణేనాయక్ భార్య జయమ్మ కుమారులు అభి (5), ఆకాశ్ (4)తో హైదరాబాద్లో ఉంటూ ఆటో నడుపుతున్నాడు. తండాలో గణేశ్ ఉత్సవాలు జరుగుతుండడంతో వాటిని చూసేందుకు మంగళవారం రాత్రి భార్యాపిల్లలతో కలిసి తండాకు వచ్చాడు.
బుధవారం ఇంటి ముందు ఆడుకుంటున్న అభి, ఆకాశ్ ప్రమాదవశాత్తు పక్కనే నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి వద్ద గల నీటి సంపులో పడిపోయారు. పిల్లలు కనిపించకపోవడంతో జయమ్మ, స్థానికులతో కలిసి చుట్టుపక్కల గాలించగా నీటి గుంతలో ఇద్దరి డెడ్బాడీలు దొరికాయి. ఇద్దరు పిల్లలు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు.