మోదీని కేసీఆర్​ అనేకసార్లు పొగిడారు: రేవంత్

మోదీని కేసీఆర్​ అనేకసార్లు పొగిడారు: రేవంత్
  • కేసీఆర్​2018లో బీజేపీ నేతలను ప్రగతిభవన్​కు పిలిచారని వ్యాఖ్య
  • బీఎల్​సంతోష్​ను అరెస్ట్​చేసే దమ్ముందా? అంటూ ప్రశ్న

హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్​పార్టీని దెబ్బ తీసేందుకు బీఆర్ఎస్, బీజేపీలు కలిసి అవకాశవాద రాజకీయాలు చేస్తున్నాయని పీసీసీ చీఫ్​రేవంత్​రెడ్డి ఆరోపించారు. రెండు రోజుల నుంచి ప్రధాని మోదీ, మంత్రి కేటీఆర్​వ్యాఖ్యలను పరిశీలిస్తే ఇదే విషయం స్పష్టమవుతున్నదని చెప్పారు. అచ్చంపేట నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు, జీహెచ్ఎంసీ మాజీ కార్పొరేటర్​ గురువారం రేవంత్​ నివాసంలో కాంగ్రెస్​ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రేవంత్​ మాట్లాడారు. కేసీఆర్​సీఎం అయినప్పటి నుంచి సందర్భం వచ్చినప్పుడల్లా మోదీని పొగుడుతూనే ఉన్నారని విమర్శించారు. మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయానికీ కేసీఆర్​మద్దతిచ్చారని గుర్తు చేశారు. 2016లో మిషన్​ భగీరథ ప్రారంభోత్సవంలో మోదీని కేసీఆర్​పొగిడారన్నారు. మోదీ ప్రభుత్వం అత్యంత ప్రగతిశీలమైనదని, రాష్ట్రాలకు అనుకూలంగా ఉంటుందని గతంలో కేసీఆర్​అన్నారని వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి వారి మధ్య బంధం ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. నోట్ల రద్దుపై దేశమంతా గగ్గోలు పెడితే.. కేసీఆర్​మాత్రం పూర్తిగా మద్దతు తెలిపారన్నారు.

ప్రగతిభవన్​వేదికగా కుట్ర

2018 ఆగస్టులో అసెంబ్లీని రద్దు చేస్తారన్న చర్చ జరుగుతున్న టైమ్​లో ఢిల్లీకి వెళ్లి వచ్చిన కేసీఆర్​.. బీజేపీ నేతలను ప్రగతిభవన్​కు పిలిపించుకున్నారని, ఏ నేతకూ అపాయింట్​మెంట్​ఇవ్వలేదని రేవంత్​అన్నారు. ‘‘మాజీ ప్రధాని వాజ్​పేయి స్మృతి వనం ఏర్పాటు చేసేందుకు స్థల కేటాయింపునకు విజ్ఞప్తి చేశామని అప్పుడు బీజేపీ నేతలు చెప్పారు. కానీ, దాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్​ను దెబ్బ తీసేందుకు ప్రగతిభవన్​వేదికగా బీఆర్ఎస్, బీజేపీ కుట్ర పన్నాయి. లేకపోతే ఐదేండ్లు గడుస్తున్నా ఏ ఒక్కరూ వాజ్​పేయి స్మృతి వనం ఏర్పాటు గురించి మాట్లాడటం లేదు. హంగ్​వస్తే బీఆర్ఎస్​కే మద్దతిస్తామంటూ 2018 ఎన్నికల టైమ్​లో అప్పటి బీజేపీ రాష్ట్ర చీఫ్​ లక్ష్మణ్​వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్​, బీజేపీ బంధానికి ఆ వ్యాఖ్యలే నిదర్శనం’’ అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్​ గాలి వీస్తున్నదని, ఆరు గ్యారెంటీలతో జనం కాంగ్రెస్​పార్టీవైపు చూస్తున్నారని తెలిపారు.

కేసీఆర్​.. ఆ కేసు యాదికున్నదా?

బీఆర్ఎస్​ఎమ్మెల్యేలకు బీజేపీ ఎరవేస్తున్నదంటూ తెలంగాణ ప్రజలకు పెట్టుకున్న మొర యాదికున్నదా అంటూ కేసీఆర్​ను రేవంత్​ప్రశ్నించారు. రాహుల్ గాంధీ జోడో యాత్ర నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి ఇద్దరు తోడు దొంగలు ఆడిన నాటకం గుర్తొచ్చిందా అంటూ ఓ ట్వీట్​లో ప్రశ్నించారు. ‘‘ఆ కేసు(ఫౌం హౌస్​) ఏడాది కావొస్తున్న శుభసందర్భంలో.. మీ సర్కారును కూలదోస్తామన్న కుట్రదారు బీఎల్​ సంతోష్​ హైదరాబాద్​వచ్చారట కదా. ఇన్నాళ్లూ అడ్రస్​దొరకలేదని తప్పించుకుంటిరి.. మరి, ఇప్పుడైనా ఆయనను అరెస్ట్​ చేసే దమ్ముందా? ఆ కట్టు కథను ప్రజలు మరచిపోతారులే అని ఆతిథ్యమిస్తారా? లేక సిట్​ను నిద్రలేపి అరెస్టు చేస్తారా? మీ సమాధానం కోసం తెలంగాణ చూస్తున్నది’’ అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.