- అసెంబ్లీలో హరీశ్, తలసాని, సబిత
- మండలిలో రమణ, శ్రీనివాస్ను నియమించిన కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే సూచనలు కనిపించడం లేదు. సోమవారం అసెంబ్లీ సెషన్కు హాజరైన ఆయన.. సంతకం చేసి మూడు నిమిషాలు మాత్రమే సభలో ఉండి బయటకు వెళ్లిపోయారు. అయితే, అసెంబ్లీకి మంగళవారం తాజాగా డిప్యూటీ ఫ్లోర్ లీడర్లను కేసీఆర్ నియమించారు.
అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్లుగా హరీశ్ రావు, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ను నియమించారు. మండలిలో పార్టీ ఉప నేతలుగా ఎల్.రమణ, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని నియమించగా.. మండలి పార్టీ విప్గా దేశపతి శ్రీనివాస్ను నియమించారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్ల నియామకంతో కేసీఆర్ ఈ సభ సమావేశాల్లో కృష్ణా నీళ్ల అంశంపై చర్చకు అందుబాటులో ఉండడం లేదని తెలుస్తున్నది. కాగా, తొలిరోజు అసెంబ్లీ సమావేశాల నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన కేసీఆర్.. హైదరాబాద్ నందినగర్లోని నివాసంలోనే ఉంటున్నారు.
దీంతో అక్కడికి బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు కేసీఆర్ను కలిసేందుకు మంగళవారం పోటెత్తారు. కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రావడంతో భద్రతా సిబ్బంది వారిని లైన్లో ఉంచి కేసీఆర్ వద్దకు పంపించారు. మంగళవారమే ఫాంహౌస్కు వెళ్లాల్సి ఉన్నా.. వచ్చిన కార్యకర్తలను కలిసేందుకు ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నట్టు తెలిసింది.
