
- ఏమీ మాట్లాడకుండానే డైరెక్ట్ సస్పెన్షన్ వేటు
- గులాబీ బాస్ మనసులో ఏముందోనన్న అయోమయంలో పార్టీ క్యాడర్
- ముందే రియాక్ట్ అయి ఉంటే పరిస్థితి ఇంతదూరం వచ్చేది కాదన్న అభిప్రాయాలు
- బిడ్డ మీద చర్యలు తీసుకునేలా తండ్రిపై సన్నిహితులే ఒత్తిడి తెచ్చారన్న వాదనలు
- కవిత ప్రెస్మీట్ టైమ్లో ఫామ్హౌస్లో రౌండ్స్కు వెళ్లిన కేసీఆర్
హైదరాబాద్, వెలుగు: కవిత ఎపిసోడ్పై బీఆర్ఎస్అధినేత కేసీఆర్ఇప్పటికీ స్పందించడం లేదు. ఆమె హరీశ్రావు, సంతోష్రావు పేర్లు చెప్పి మరీ డోస్ పెంచి తీవ్రమైన ఆరోపణలు చేసినా.. ఆయన మౌనముద్రలోనే ఉండిపోయారు. వాళ్ల పేర్లు బయటపెట్టిన వెంటనే కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమూ పార్టీలోని ఓ వర్గం నేతలను గందరగోళానికి గురిచేస్తున్నదనే చర్చ జరుగుతున్నది. అసలు కేసీఆర్ మనసులో ఏముందో తెలియక వాళ్లంతా అయోమయంలో పడిపోతున్నారన్న వాదన వినిపిస్తున్నది. అసలు కేసీఆర్కు కవిత రాసిన లేఖ లీక్ అయినప్పుడు.. ఆమె చేసిన వ్యాఖ్యలపై ఆనాడే ఆయన స్పందించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి. అప్పుడే కవితతో కేసీఆర్ మాట్లాడి ఉంటే, పరిస్థితి ఇంతదూరం వచ్చేది కాదన్న చర్చ నడుస్తున్నది. కేసీఆర్ కాకపోయినా కనీసం కేటీఆర్అయినా ముందే స్పందించి ఉండాల్సిందన్న అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. కేటీఆర్ కూడా తన చెల్లితో రాఖీ కట్టించుకోకుండా పండుగ పూట దూరంగా బెంగళూరుకు వెళ్లడంపైనా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
వాస్తవానికి కవిత దెయ్యాలు వ్యాఖ్యలు చేయడంతోనే కేసీఆర్ తనకు సన్నిహితులైన దివికొండ దామోదర్రావు, గండ్ర మోహన్రావును రాయబారానికి పంపారు. కానీ కేసీఆర్ తనతో మాట్లాకుండా బయటి వ్యక్తులను పంపడంతో వారి మాటలను ఆమె లెక్క చేయలేదు. ఆ తర్వాత వెంటనే కవిత మీడియా చిట్చాట్లో తన అన్న కేటీఆర్, బావ హరీశ్రావుపై పరోక్షంగా ఆరోపణలు చేశారు. అప్పుడైనా కేసీఆర్ టచ్లోకి వస్తారని ఆమె ఆశించినా.. ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఆ తర్వాత కేసీఆర్ అనేకసార్లు కేటీఆర్, హరీశ్తో భేటీ అయ్యారు. కవితపై బహిరంగంగా ఎక్కడా విమ ర్శలు చేయవద్దని సూచన చేశారే తప్ప.. కనీసం వారిద్దరూ వెళ్లి కవితను కలిసి మాట్లాడాలని సలహా ఇవ్వలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు.. విచా రణకు వెళ్తున్న సమయంలో కవిత ఫాంహౌస్కు వెళ్లినా కేసీఆర్ ఆమెను పట్టించుకోలేదు. కనీసం ఆమెవైపు కన్నెత్తి కూడా చూడలేదు. కానీ కేసీఆర్కాకపోయినా, కనీసం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్అయినా తనను పిలిచి మాట్లాడి ఉంటే బాగుండని బహిరంగంగానే కవిత తన ఆవేదనను చెప్పుకున్నారు.
ఒత్తిడి తెస్తున్నారా?
కవిత విషయంలో చర్యలు తీసుకునేలా కేసీఆర్పై సొంత కుటుంబ సభ్యులే ఒత్తిడి తెచ్చారన్న వాదనలూ పార్టీలో వినిపిస్తున్నాయి. కవితను బుజ్జగించి దారికి తెచ్చుకోవాల్సినవారే.. ఆ పనిచేయకుండా తమ అనుచరులతో సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టారని, ఈ క్రమంలోనే సోమవారం కవిత ప్రెస్మీట్పెట్టి సంచలన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు. తాము అనుకున్నట్లుగా కవిత మాట్లాడడంతో దీనిని సాకుగా చూపి కేసీఆర్కు ఆమెపై కోపం పెరిగేలా రెచ్చగొట్టారని, ఈ క్రమంలోనే ఆమెను పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్న వాదన ఉంది. తన సొంత కూతురు, పార్టీ ఎమ్మెల్సీ కూడా అయిన కవితను సస్పెండ్ చేస్తే పార్టీ కుదుపునకు లోనవుతుందని, రాజకీయంగా దుమారం రేగుతుందని తెలిసి కూడా కేసీఆర్ బయటకు రాలేదు. కవితను ఎందుకు సస్పెండ్ చేస్తున్నామనే విషయాన్ని లీడర్లకు, క్యాడర్కు చెప్పే ప్రయత్నం కూడా చేయలేదు. దీంతో క్యాడర్లో అయోమయం నెలకొంది. కేసీఆర్ మౌనం.. ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తున్నది. కవితను సస్పెండ్ చేయడం ఇష్టం లేనప్పటికీ, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకే ఆయనఈ నిర్ణయం తీసుకున్నారా? లేదంటే పార్టీకి నష్టం జరుగుతుందని భావించే సస్పెండ్ చేశారా? అనేది అంతుచిక్కడం లేదని పార్టీలోని ఓ వర్గం అంటున్నది. ఇక హరీశ్ రావుపై కవిత తీవ్ర ఆరోపణలు చేసిన తర్వాత పార్టీలోని పలువురు సీనియర్లు ఆమెకు కౌంటర్గా మాట్లాడారు. పద్మా దేవేందర్ రెడ్డి లాంటి వాళ్లు తీవ్ర విమర్శలు చేశారు. ఇదంతా కేసీఆర్కు తెలిసే జరుగుతున్నదా? లేదా? అనే అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం కవిత నుంచి వివరణనైనా తీసుకుని చర్యలు తీసుకుంటే బాగుండేదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
సోషల్ మీడియా సైన్యం..
కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో బీఆర్ఎస్సోషల్ మీడియాలో ఆమెపై విమర్శలు తీవ్రమయ్యాయి. ‘కవిత ఉంటే ఎంత.. పోతే ఎంత’ అనే స్థాయిలో పలువురు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఆమె ఇంటి పేరు పైనా కామెంట్లు తీవ్రమయ్యాయి. కల్వకుంట్ల కాదు.. దేవనపల్లి అంటూ పోస్టులు చేయడమూ మొదలుపెట్టారు. లిక్కర్ స్కామ్కూ లింక్పెట్టి విమర్శలు చేస్తున్నారు. అయితే, వారికి దీటుగా బదులిచ్చేందుకు కవిత కూడా సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు సోషల్ మీడియా టీమ్ను పటిష్టం చేసుకునే పనిలో పడినట్టు చెబుతున్నారు. ఇప్పటికే ఈ విషయాన్ని ఆమె బహిరంగంగానే చెప్పారు. తనపై ఎంత ట్రోల్చేస్తారో.. అంతకు రెట్టింపు ట్రోల్స్చేస్తామని హెచ్చరించారు.
కావాలనే కేసీఆర్.. కవిత ప్రెస్మీట్ చూడలేదా?
కవిత సరిగ్గా ప్రెస్మీట్ పెట్టే సమయంలోనే కేసీఆర్.. తన ఫామ్హౌస్లో రౌండ్స్కు వెళ్లారు. మూడు నాలుగు కార్ల కాన్వాయ్తో ఫామ్హౌస్లోని పంటలను పరిశీలించేందుకు వెళ్లారు. దాదాపు గంట రెండు గంటల పాటు ఫాంహౌస్లో కలియతిరిగి పంటలను పరిశీలించాక గోశాలకు వెళ్లి.. మళ్లీ ఫాంహౌస్లోని తన ఇంటికి వచ్చారు. కవిత చెప్పే మాటలు వినలేకే ఆమె ప్రెస్మీట్ను స్కిప్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఫామ్హౌస్లో పంటల పరిశీలనకు వెళ్లినప్పుడు కేటీఆర్, జగదీశ్రెడ్డి వంటి నేతలు అక్కడే ఉన్నారు. కవిత ప్రెస్మీట్ అయిన తర్వాత సింగరేణి నాయకులు బీఆర్ఎస్లో చేరిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. కవిత అంశంపై మాట్లాడుతారని అనుకున్నా.. ఆయన ఆ వ్యవహారంపై స్పందించలేదు. ఆ తర్వాత కవిత ఎపిసోడ్పై కేసీఆర్, కేటీఆర్, జగదీశ్రెడ్డి మధ్య చర్చ జరిగిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేసినా.. కవిత వ్యాఖ్యల వల్ల కలిగిన నష్టాన్ని ఎలా పూడ్చాలన్న దానిపై చర్చించారని అంటున్నాయి. రాజకీయంగానే కవిత ఎపిసోడ్ మొదలైనా.. చివరకు కుటుంబం నుంచి ఆమె దూరమయ్యే పరిస్థితికి వచ్చిందని చెబుతున్నాయి.