కార్పొరేటర్ దేదీప్యరావుపై దాడి .. ఫ్లెక్సీల తొలగింపు వివాదాస్పదం

కార్పొరేటర్ దేదీప్యరావుపై దాడి .. ఫ్లెక్సీల తొలగింపు వివాదాస్పదం
  • నలుగురు మహిళలపైక్రిమినల్​ కేసు నమోదు

జూబ్లీహిల్స్, వెలుగు: కాంగ్రెస్​ పార్టీకి చెందిన ఫ్లెక్సీల తొలగింపు వ్యవహారం వెంగళరావునగర్(99వ డివిజన్) కార్పొరేటర్ దేదీప్యరావుపై దాడికి దారి తీసింది. వివరాల్లోకి వెళ్తే.. కాంగ్రెస్ నాయకులు ఓ కార్యక్రమానికి సంబంధించి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని యూసుఫ్ గూడా చౌరస్తాతోపాటు పలు ప్రాంతాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కార్యక్రమం అయిపోయాక కూడా ట్రాఫిక్​కు అంతరాయం కలిగించేలా ఉన్న ఫ్లెక్సీలను చూసిన కార్పొరేటర్ దేదీప్యరావు వాటిని తొలగించాలని బల్దియా అధికారులకు ఫిర్యాదు చేశారు.

మంగళవారం రాత్రి జీహెచ్ఎంసీ సిబ్బంది యూసుఫ్​గూడ చౌరస్తాలోని ఫ్లెక్సీలను తొలగిస్తుండగా స్థానిక మహిళలు అక్కడికి చేరుకుని అడ్డుకున్నారు. బల్దియా సిబ్బంది వెంటనే కార్పొరేటర్​కు ఫోన్​చేసి చెప్పగా, ఆమె తన భర్త విజయ్ కుమార్ తో కలిసి కారులో అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో కొందరు మహిళలు కార్పొరేటర్​పై దాడిచేశారు. దేదీప్యరావు, విజయ్​కుమార్ ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు భావన, నాగలక్ష్మి, హెస్సెన్, లక్ష్మి అనే నలుగురు మహిళలపై ఐపీసీ 323, 504,506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 

సీఎం స్పందించి చర్యలు తీస్కోవాలి: ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్

మహిళా కార్పొరేటర్​పై దాడి చేయడం దారుణమని, గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరగలేదని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. సీఎం రేవంత్​రెడ్డి స్పందించి కార్పొరేటర్​ దేదీప్యరావుపై దాడి చేసినోళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు బుధవారం మధురానగర్​లో ప్రెస్​మీట్ ​పెట్టి మాట్లాడారు. కాంగ్రెస్ ​పార్టీకి చెందిన మహిళలే తనపై దాడిచేశారని కార్పొరేటర్​దేదీప్యరావు ఆరోపించారు. డీఆర్ఎఫ్​ టీం ఫోన్​ చేస్తేనే తాను యూసుఫ్​గూడ చెక్​పోస్టుకు వెళ్లానని చెప్పారు.