
- మహారాష్ట్ర లేదు.. ఏపీ లేదు..ఓన్లీ తెలంగాణ
- అసెంబ్లీ ఎన్నికల దాకా బీఆర్ఎస్ ఫోకస్ అంతా ఇక్కడే
- పొరుగు రాష్ట్రాల్లో యాక్టివిటీ బంద్
- ఆగిన మహారాష్ట్ర లీడర్ల చేరికల హడావుడి
- కేసీఆర్ వెంట కనిపించని పార్టీ ఏపీ అధ్యక్షుడు
- తెలంగాణలో గెలిచినంకే జాతీయ రాజకీయాలు!
- అప్పటివరకు ఎక్కడోళ్లు అక్కడ గప్చుప్
హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చి దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తెస్తానని చెప్పి మహారాష్ట్ర, ఏపీ రాజకీయాలపై ఫోకస్ పెట్టిన కేసీఆర్.. ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో యాక్టివిటీని బంద్ పెట్టారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా ఎత్తుగడలు వేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యే వరకు పొరుగు రాష్ట్రాల్లో పార్టీ కార్యకలాపాలను ఆపేయాలని కేసీఆర్నిర్ణయానికి వచ్చినట్టు బీఆర్ఎస్ ముఖ్యులు చెప్తున్నారు. రాష్ట్రంలో అధికారం నిలబెట్టుకున్నాక జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టొచ్చనే భావనలో ఆయన ఉన్నారని వారు అంటున్నారు. ఇదే క్రమంలో 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్.. ప్రత్యర్థి పార్టీలను బోల్తా కొట్టించేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. మొన్నటి వరకు కేసీఆర్ వెంట కనిపించిన ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు ఇప్పుడు ఆయన వెంట కనిపించడం లేదు. 20 రోజుల కిందటి వరకు మహారాష్ట్ర నుంచి భారీగా చేరికలంటూ హడావుడి చేసిన గులాబీ వర్గాలు.. ఇప్పుడు సైలెంట్ అయ్యాయి.
ఒక్కొక్కరుగా దూరమవుతున్నరు!
కేంద్రంలో కాంగ్రెస్సేతర, బీజేపీ యేతర ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటు దిశగా 2017, 2018లోనే కేసీఆర్ ప్రయత్నాలు మొదలు పెట్టారు. 2019 లోక్సభ ఎన్నికల టైమ్లోనూ పలు ప్రాంతీయ పార్టీలతో ఈ కూటమి దిశగా చర్చలు సాగించారు. పార్లమెంట్ఎన్నికల్లో బీజేపీ మళ్లీ విజయం సాధించడంతో కొన్నాళ్లు ఆయన సైలెంట్అయ్యారు. జాతీయ స్థాయిలో తెలంగాణ మోడల్కు ఆదరణ ఉందని చెప్తూ టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా 2022 అక్టోబర్లో మార్చి జాతీయ రాజకీయాల్లో అడుగు పెడుతున్నట్టుగా ప్రకటించారు. పార్టీ పేరు మార్పు సమయంలో కేసీఆర్ వెన్నంటే ఉన్న కర్నాటక మాజీ సీఎం కుమారస్వామి సహా మిగతా నాయకులందరూ ఆ తర్వాత దూరం జరిగారు. కొన్ని రోజుల కిందటి వరకు కేసీఆర్తో కనిపించిన రైతు సంఘాల నాయకులు కూడా ఇప్పుడు కనిపించడం లేదు.
సర్వేల మీద సర్వేలు చేయిస్తూ..!
రాష్ట్ర అసెంబ్లీకి షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నెల 19 నుంచి నిర్వహించే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఇండియా పేరు భారత్గా మార్చడం, చట్ట సభల్లో మహిళల కోటా సహా పలు కీలక బిల్లులు ఉంటాయని ప్రచారం జరుగుతున్నది. జమిలిపైనా పార్లమెంట్లో చర్చ జరగొచ్చు కానీ.. ఈ అసెంబ్లీ ఎన్నికలకే జమిలి ఎన్నికలు అమల్లోకి రాకపోవచ్చని ప్రగతి భవన్వర్గాలు లెక్కలు కడుతున్నాయి. ఈ క్రమంలోనే అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా కేసీఆర్ పావులు కదుపుతున్నారు.
బయటికి రాష్ట్రంలో పార్టీ యాక్టివిటీని స్లో చేసినట్టుగా చెప్తున్నా అండర్గ్రౌండ్వర్క్ కంటిన్యూ చేస్తున్నారు. సిట్టింగ్ఎమ్మెల్యేలతో పాటు పార్టీ టికెట్లు ఇచ్చిన క్యాండిడేట్ల నియోజకవర్గాల్లో సర్వేలు చేయించడం, ఎక్కడ ఏ పార్టీ ప్రభావం ఏ మేరకు ఉంది.. ఎక్కడ ఎవరికి ఎడ్జ్ ఉంటుంది.. వ్యక్తిగతంగా ఓట్లు సాధించే లీడర్లెవరు.. చిన్నా చితక పార్టీలు ఎంతమేరకు ఓట్లు సాధిస్తయ్.. వాటి ప్రభావం ఏ ప్రధాన పార్టీపై పడుతుంది.. కాంగ్రెస్తో కమ్యూనిస్టులు జట్టుకడితే ఎన్నికల ఫలితాలు ఎట్ల ఉంటాయనే కోణంలో డజనుకు పైగా సర్వే ఏజెన్సీలను రంగంలోకి దించి జనం నాడి తెలుసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లయినా గట్టెక్కి మళ్లీ గద్దెనెక్కడమే టార్గెట్గా కేసీఆర్అడుగులు వేస్తున్నారు. ఈక్రమంలోనే ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు బ్రేకులు వేశారు.
వెంట కనిపించని తోట
బీఆర్ఎస్ పేరు మార్పు తర్వాత ఆంధ్రప్రదేశ్కు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా తోట చంద్రశేఖర్ను కేసీఆర్ నియమించారు. కొందరు లీడర్లకు గులాబీ కండువాలు కప్పి మొదట్లో హడావుడి చేశారు. మహారాష్ట్రలో పార్టీ ఖర్చుతో ఆఫీసులు ఏర్పాటు చేస్తే ఏపీలో మాత్రం స్థానిక నాయకులే బీఆర్ఎస్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రత్యేక విమానంలో నాగ్పూర్కు వెళ్లి పార్టీ ఆఫీస్ప్రారంభానికి రిబ్బన్కట్చేసిన కేసీఆర్.. విజయవాడలో ఏపీ పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవాన్ని మాత్రం పట్టించుకోలేదు. వైజాగ్స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ ఉద్యమించబోతున్నట్టు ప్రకటించి.. ఆ తర్వాత చల్లబడ్డారు. వైజాగ్, విజయవాడ, తిరుపతి, కర్నూల్లో భారీ బహిరంగ సభలు ఉంటాయని బీఆర్ఎస్ హైకమాండ్ నుంచే స్వయంగా లీకులు ఇచ్చినా.. ఆ తర్వాత చడీచప్పుడు లేదు. మొత్తంగా ఏపీలో గులాబీ పార్టీని కోల్డ్స్టోరేజీలో పెట్టేశారు.
కొన్నాళ్ల కిందటి వరకు నేతల చేరికలతో ఏపీలో కొద్దిపాటి యాక్టివిటీ కనిపించేది. కేసీఆర్ పట్టించుకోవడం మానేశాక ఏపీ లీడర్లు కూడా హడావుడి తగ్గించేశారు. గతంలో బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సీఎం కేసీఆర్ వెంట అప్పుడప్పుడు కనిపించేవారు. ఆయన ఎక్కువగా హైదరాబాద్లోనే ఉంటున్నా ఈ మధ్య కేసీఆర్ వెంట మాత్రం కనిపించడం లేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలే టార్గెట్గా పనిచేస్తున్న కేసీఆర్.. పొరుగు రాష్ట్రాల పేరు ఎత్తడానికి కూడా ఇష్టపడటం లేదని ప్రగతి భవన్తో నిత్యం టచ్లో ఉండే నేత చెప్పారు.
మహారాష్ట్ర సభ లేనట్టే!
ప్రగతి భవన్ పక్కన ఉన్న టూరిజం ప్లాజా హోటల్లో రెండు వారాల కిందటి వరకు మహారాష్ట్ర వాసులే ఎక్కువగా కనిపించేవారు. స్టేట్ టూరిజం బస్సుల్లో కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్భగీరథ, సిద్దిపేట జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలను వారికి బీఆర్ఎస్ లీడర్లు చూపించి మహారాష్ట్రకు తిరిగి పంపించేవాళ్లు. ఇప్పుడు ఆ యాక్టివిటీ దాదాపు ఆగిపోయింది. చివరిసారిగా ఆగస్టు 27న మహారాష్ట్రకు చెందిన పలువురు కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. అదే నెల 30న మంత్రి హరీశ్ మహారాష్ట్రలోని సోలాపూర్కు వెళ్లివచ్చారు. దీంతో అక్కడ కేసీఆర్బహిరంగ సభ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పటి వరకు ఆ సభ ఊసే లేదు. మహారాష్ట్రలో పార్టీ కార్యకలాపాలు తగ్గించేశారు. అక్కడ మొత్తం పార్టీ విస్తరణ ఇప్పటికిప్పుడే సాధ్యం కాకపోవచ్చని.. సరిహద్దు నియోజకవర్గాల్లో ఇక్కడి సంక్షేమ పథకాల ప్రభావం ఉంటుందని, ఆయా ప్రాంతాలపైనే దృష్టి సారించాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తున్నది.