కొడంగల్ లో..వన్ ఇంటి గ్రేటెడ్ క్యాంపస్..మెడికల్, ఇంజనీరింగ్.. ఇతర విద్యా సంస్థలన్నీ ఏర్పాటు

 కొడంగల్ లో..వన్ ఇంటి గ్రేటెడ్ క్యాంపస్..మెడికల్, ఇంజనీరింగ్.. ఇతర విద్యా సంస్థలన్నీ ఏర్పాటు
  • కొడంగల్​ లో..వన్ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్ మెడికల్, ఇంజనీరింగ్.. 
  • ఇతర విద్యా సంస్థలన్నీ ఏర్పాటు
  • ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్
  • పోలేపల్లి, హకీంపేటలో 224 ఎకరాలను కేటాయించిన టీజీఐఐసీ 
  • రెండు నెలల కింద భూ పరిహారం అందించిన రాష్ట్ర సర్కార్

మహబూబ్​నగర్/కొడంగల్, వెలుగు: వలసల జిల్లాగా పేరొందిన ఉమ్మడి పాలమూరు జిల్లాలో విద్యా వ్యవస్థను పటిష్టం చేసేందుకు సీఎం రేవంత్​రెడ్డి స్పెషల్​ ఫోకస్ ​పెట్టారు. గతేడాది పాలమూరు యూనివర్సిటీకి అనుబంధంగా ఇంజనీరింగ్, లా కాలేజీలను మంజూరు చేయించారు. అదే ఏడాది ప్రతిష్ఠాత్మక ఐఐఐటీ బ్రాంచ్​ను కేటాయించారు. తాజాగా సీఎం సొంత సెగ్మెంట్ కొడంగల్​ను ఎడ్యుకేషన్​హబ్​గా తీర్చిదిద్దేందుకు దృష్టి సారించారు.

 ‘వన్​ఇంటి గ్రేటెడ్ ​క్యాంపస్’​ తరహాలో అన్నిరకాల విద్యా సంస్థలను నిర్మించనున్నారు. ఇందుకు 224.04 ఎకరాలను అలాట్ ​చేస్తున్నట్లు సోమవారం ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.  

టీజీఐఐసీ భూములు కేటాయింపు

గతేడాది కొడంగల్, కోస్గి ప్రాంతాల్లో పలు కాలేజీలను మంజూరు చేయగా, వాటికి భూ కేటాయింపులు జరిగాయి. కానీ ఆయా భూములు విద్యా సంస్థల నిర్మాణాలకు సరిపోవడం లేదు. దీంతో కొడంగల్​ఏరియా డెవలప్​మెంట్​అథారిటీ (కాడా) పరిధిలో ‘వన్​ ఇంటిగ్రేటెడ్ ​క్యాంపస్’ నిర్మించాలని, ఇందుకు భారీగా భూమి అవసరమని రాష్ట్ర సర్కార్ గుర్తించింది. గత నెల13న ‘కాడా’ అధికారులతో సీఎం రివ్యూ మీటింగ్ ​నిర్వహించారు. ఇందులో ‘వన్​ ఇంటిగ్రేటెడ్ క్యాంపస్’ పై ప్రస్తావించి, వెంటనే ప్రపోజల్స్​ రెడీ చేయాలని కాడా ఆఫీసర్లను ఆదేశించారు. క్యాంపస్ కు ఆల్టర్నేట్​ఏరియాను చూపించాలని సూచించారు. తెలంగాణ ఇండస్ర్టియల్​ఇన్​ఫ్రాస్ర్టక్చర్​ కార్పొరేషన్(టీజీఐఐసీ) ఆధీనంలోని దుద్యాల మండలం పోలేపల్లి, హకీంపేట మండలాల్లోని 224.04 ఎకరాలను కేటాయిస్తున్నట్టు అధికారులు తెలిపారు. 

అన్ని కాలేజీలు ఒకే చోట..

కొడంగల్​ సెగ్మెంట్ లో పరిశ్రమలు, ఇతర అభివృద్ధి పనులకు హకీంపేట, లగచర్ల, పోలేపల్లి ప్రాంతాల్లో రాష్ర్ట ప్రభుత్వం దాదాపు వెయ్యి ఎకరాల భూములను సేకరించింది. 

అవి టీజీఐఐసీ ఆధీనంలో ఉన్నాయి. పోలేపల్లిలోని సర్వే నంబర్67లో 107.16 ఎకరాలు, హకీంపేటలోని సర్వే నంబర్లు 243, 244, 245, 247, 252 లో116.28 ఎకరాలు కలిపి మొత్తంగా 224.04 ఎకరాలను ‘వన్​ఇంటిగ్రేటెడ్ ​క్యాంపస్’కు కేటాయించారు. ఇందులో ప్రభుత్వ మెడికల్​ కాలేజీకి 15 ఎకరాలు, ప్రభుత్వ జనరల్ ​ఆస్పత్రి, నర్సింగ్, పారా మెడికల్, ఫిజియోథెరపీ కాలేజీలకు 22.24 ఎకరాలు, ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీకి, అడ్వాన్డ్స్​ టెక్నాలజీ సెంటర్​(ఏటీసీ) సెంటర్​కు 3.14 ఎకరాలు, ఇంజనీరింగ్​కాలేజీకి 7.29 ఎకరాలు, వెటర్నరీ కాలేజీకి 27 ఎకరాలు, సైనిక్​ స్కూల్​కు 11.6 ఎకరాలు, యంగ్​ఇండియా ఇంటిగ్రేటెడ్​ స్కూల్​కు 20 ఎకరాలు, ఫైర్ ​స్టేషన్​కు ఎకరం, 

పోలీస్​ స్టేషన్​కు 3 ఎకరాలు, ఆర్అండ్ బీ గెస్ట్​హౌస్​కు ఎకరం, ఎలక్ర్టికల్​సబ్​ సెంటర్​కు 3.25 ఎకరాలు, ఓపెన్​థియేటర్, ఆడిటోరియం, రన్నింగ్ ​ట్రాక్​, స్విమ్మింగ్​పూల్స్, స్టేడియం నిర్మాణాలకు114.20 ఎకరాలు కేటాయించారు. వారం రోజుల్లో ఆయా విద్యా సంస్థల హెడ్​లకు భూములను అప్పగించనున్నారు.  

బాధితులకు పరిహారం చెల్లింపు

లగచర్ల, హకీంపేట, పోలేపల్లి గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూమితో పాటు రైతుల నుంచి భూములను సేకరించింది. మూడు మండలాల్లో దాదాపు వెయ్యికి పైగా ఎకరాలను తీసుకుంది. ఆయా భూములు ఇచ్చిన రైతులకు 2 నెలల కింద ఎకరాకు రూ.20 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. అదేవిధంగా ప్రత్యేక ప్యాకేజీ కింద ఒక ఎకరాకు 150 గజాల ప్లాట్​ను కేటాయించింది. ఆయా ప్లాట్లను హకీంపేట-, లగచర్ల శివారు మధ్య రోడ్డు పక్కనే ఇచ్చింది. ప్రస్తుతం లే అవుట్​ప్రాసెస్​నడుస్తుండగా.. త్వరలోనే రైతులకు అందజేస్తారు.