జడ్పీలో బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్​

జడ్పీలో బీఆర్ఎస్ గ్రాఫ్ డౌన్​
  •     పెరుగుతున్న కాంగ్రెస్ బలం
  •     జడ్పీ పీఠంపై ఎఫెక్ట్​ 
  •     పాగాల మృతితో చిల్పూరు జడ్పీటీసీ స్థానం ఖాళీ
  •     ఆసక్తికరంగా జిల్లా పరిషత్​ రాజకీయం

జనగామ, వెలుగు :  జిల్లా పరిషత్​లో బీఆర్​ఎస్​ గ్రాఫ్​రోజురోజుకీ పడిపోతోంది. జనగామ జిల్లాలో ప్రతిపక్షమే లేకుండా 12 జడ్పీటీసీ స్థానాలతో ఏర్పడిన పాలకవర్గంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పలువురు జడ్పీటీసీలు పార్టీ మారగా, జడ్పీచైర్మన్​గా ఉన్న చిల్పూరు జడ్పీటీసీ పాగాల సంపత్​రెడ్డి గత డిసెంబర్​లో హఠాన్మరణంతో ఆ స్థానం ఖాళీ అయింది. మిగిలిన జడ్పీటీసీలు కూడా హస్తం వైపు మొగ్గు చూపుతుండడంతో జడ్పీ రాజకీయం ఆసక్తి రేపుతోంది. 

అనుకోని ఛాన్స్..​

జనగామ జిల్లాలో 12 మండలాలు ఉండగా, 2019లో జరిగిన జిల్లా పరిషత్ ప్రాదేశిక ఎన్నికల్లో అన్ని మండలాలను బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. దీంతో ప్రతిపక్షమే లేకుండా పోయింది. జడ్పీ చైర్మన్ పీఠానికి బీఆర్ఎస్​లోనే అప్పట్లో తీవ్ర పోటీ నెలకొంది. ఉద్యమకారుడి కోటాలో అప్పటి సీఎం కేసీఆర్ చిల్పూరు జడ్పీటీసీ పాగాల సంపత్​రెడ్డికి అవకాశం కల్పించారు. ప్రస్తుత జనగామ ఎమ్మెల్యే, అప్పటి ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్​రెడ్డి అండదండలతో సంపత్​రెడ్డి జడ్పీ చైర్మన్​ అయ్యారు. వైస్​చైర్ పర్సన్​గా బచ్చన్నపేట జడ్పీటీసీ గిరబోయిన భాగ్యలక్ష్మిని ఎంపిక చేశారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత జడ్పీ చైర్మన్ పాగాల గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. 

దీంతో జడ్పీ చైర్మన్ పీఠం ఖాళీ కావడంతో వైస్​చైర్​పర్సన్​గా ఉన్న గిరిబోయిన భాగ్యలక్ష్మికి చైర్​పర్సన్​గా అవకాశం దక్కింది. ఈమె అభ్యర్థిత్వాన్ని తీవ్ర స్థాయిలో వ్యతిరేకించిన జడ్పీటీసీలు నిబంధనల కారణంగా ఏమీ చేయలేక పోయారు. అడ్డుకునేందుకు ఎంత ప్రయత్నించినా ఆమెనే బాధ్యతలు స్వీకరించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె చైర్​పర్సన్​గా ఉన్నప్పటికీ జడ్పీటీసీలు అయిష్టంగానే ఉన్నారు. గత నెలలో జరిగిన జడ్పీ జనరల్​బాడీ మీటింగ్​కు ఎక్కువ మొత్తం జడ్పీటీసీలు డుమ్మా కొట్టడమే ఉదాహరణగా చెప్పవచ్చు. 

సగానికి సగం..

రేవంత్​సర్కారు ఏర్పడ్డాక బీఆర్​ఎస్ నుంచి ప్రజాప్రతినిధులు కాంగ్రెస్​లో చేరడంతో రాజకీయ పరిస్థితులు మారుతున్నాయి. ఇటీవల జనగామ జిల్లాలోని పలువురు జడ్పీటీసీలు కాంగ్రెస్​లోకి రావడంతో జడ్పీ పీఠంపై ఎఫెక్ట్ పడుతుందా అనే అనుమానాలు మొదలయ్యాయి. జిల్లాలో 12 మంది బీఆర్​ఎస్​ జడ్పీటీసీలు ఉండగా, చిల్పూరు జడ్పీటీసీ మృతితో అది ఖాళీగా ఉంది. ఇప్పట్లో అక్కడ ఎన్నికలు జరిపే పరిస్థితులు లేవు. మిగిలినవి 11 స్థానాలు ఉండగా, అందులో ఐదుగురు జడ్పీటీసీలు కాంగ్రెస్​లో చేరారు. గత నెలలో జనగామ జడ్పీటీసీ నిమ్మతి దీపిక మహేందర్​రెడ్డి కాంగ్రెస్​లో చేరగా

కడియం ఎపిసోడ్ నేపథ్యంలో స్టేషన్ ​ఘన్​పూర్​ నియోజకవర్గ పరిధిలోని రఘునాథపల్లి జడ్పీటీసీ బొల్లం అజయ్, లింగాల ఘన్​పూర్ జడ్పీటీసీ గుడి వంశీధర్​ రెడ్డి, జఫర్​ఘడ్​జడ్పీటీసీ ఇల్లందుల బేబీ కూడా ఇటీవల కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక స్టేషన్​ఘన్​పూర్​ జడ్పీటీసీ మారపాక రవి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు కాంగ్రెస్​లో చేరారు. దీంతో జడ్పీలో కాంగ్రెస్ బలం 5కు చేరగా, బీఆర్​ఎస్ బలం 6 గా ఉంది. కొద్ది రోజుల్లో మరికొందరు చేరుతారని, కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. 

ఈ లెక్కన బీఆర్​ఎస్​ జడ్పీటీసీల్లో ఒకరిద్దరు కాంగ్రెస్ వైపునకు మొగ్గు చూపితే జడ్పీ పీఠం కాంగ్రెస్​ వశమవుతుంది. రాష్ట్రంలోని పలుచోట్ల మున్సిపల్ పీఠాలను చేజార్చుకుంటున్న బీఆర్​ఎస్ జనగామ జడ్పీ పీఠాన్ని కూడా వదులు కోవాల్సి వస్తుందనే ఊహాగానాలు నెలకొన్నాయి.