అయోమయంలో వెంకటేశ్​ నేత.. ఈసారి టికెట్​ ఇవ్వరనే టాక్​

అయోమయంలో వెంకటేశ్​ నేత.. ఈసారి టికెట్​ ఇవ్వరనే టాక్​
  • పెద్దపల్లి ఎంపీని దూరం పెడుతున్న బీఆర్ఎస్ ​హైకమాండ్
  • కాంగ్రెస్, బీజేపీల వైపు వెంకటేశ్ చూపు
  • ప్రజలకు దూరం.. హైదరాబాద్​కే పరిమితం!

మంచిర్యాల, వెలుగు: పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేశ్ నేత రాజకీయ భవిష్యత్తు అయోమయంగా మారింది. ఈసారి ఎన్నికల్లో ఆయనకు మరోసారి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పెద్దపల్లి లోక్​సభ సెగ్మెంట్ పరిధిలోని ఏడు స్థానాల్లో చావుదెబ్బ తిన్న గులాబీ పార్టీ.. కాంగ్రెస్, బీజేపీలకు దీటైన అభ్యర్థి కోసం చూస్తున్నట్టు సమాచారం. దీనికితోడు వెంకటేశ్ నేత పనితీరుపై అటు పార్టీలో, ఇటు నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

గడిచిన ఐదేండ్లలో వెంకటేశ్​నేత హైదరాబాద్​కే పరిమితమై తమను పట్టించుకోలేదని జనం మండిపడుతున్నారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లోనూ అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారనే అపవాదు ఉంది. ఎమ్మెల్యేలు పిలిస్తే చుట్టపు చూపుగా నియోజకర్గాలకు వచ్చిపోవడం తప్పితే.. ఏనాడూ ప్రజా సమస్యలపై స్పందించిన దాఖలాలు లేవు. ఇవన్నీ ఆయన పొలిటికల్ కెరీర్​కు గుదిబండలా మారాయి. 

ఐదేండ్లుగా హైదరాబాద్​కే పరిమితం..

జన్నారం మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన వెంకటేశ్ నేత గతంలో ఎక్సైజ్ డిపార్ట్​మెంట్​లో ఉన్నత స్థానంలో పనిచేశారు. రాజకీయాలపై ఆసక్తితో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్​లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో చెన్నూర్ టికెట్ దక్కించుకున్నారు. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి బాల్క సుమన్ చేతిలో ఓడిపోయారు. 2019 లోక్​సభ ఎన్నికలకు ముందు అనూహ్యంగా బీఆర్ఎస్​లో చేరి పెద్దపల్లి ఎంపీగా పోటీ చేసి గెలిచారు. అయితే ఎంపీ పదవి వెంకటేశ్​కు అలంకార భూషణంగా మారిందే తప్ప ప్రజలకు ఎలాంటి ఉపయోగం లేకుండాపోయింది.

 పెద్దపల్లి లోక్​సభ సెగ్మెంట్ పరిధిలోని సమస్యలపై గానీ, అభివృద్ధిపై గానీ ఆయన ఏనాడూ పార్లమెంట్​లో మాట్లాడింది లేదు. ఈ నియోజకవర్గంలో అధిక సంఖ్యలో ఉన్న సింగరేణి కార్మికుల కష్టాలపై గళమెత్తిందీ లేదు. ఐదేండ్ల పదవీకాలంలో ఇదిగో.. ఈ పని చేశానని చెప్పుకోవడానికి కూడా ఏమీ లేదంటే ఆయన పనితీరును అర్థం చేసుకోవచ్చు. దీంతో వెంకటేశ్ నేతను ప్రజలు దాదాపుగా మర్చిపోయారంటే అతిశయోక్తి కాదు. ఆ మధ్య మా ఎంపీ కనిపించడం లేదంటూ ప్రతిపక్ష లీడర్లు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు కూడా చేశారు. 

పక్క చూపులు ఫలించేనా?

అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను మార్చకపోవడం వల్లే ఓడిపోయామంటున్న బీఆర్ఎస్.. ఇప్పటికే లోక్​సభ ఎన్నికల్లో పనితీరు సరిగా లేని సిట్టింగ్ ఎంపీల మార్పు ఖాయమన్న సంకేతాలు ఇచ్చింది. ఈ క్రమంలో వెంకటేశ్ నేతకు టికెట్ వచ్చే అవకాశాలు లేవని స్థానిక పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరోవైపు బీఆర్ఎస్ హైకమాండ్ పెద్దపల్లి జిల్లాకు చెందిన ఓ మాజీ మంత్రి వైపు మొగ్గు చూపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన కాదంటే మరో మాజీ ఎంపీ, తాజా మాజీ ఎమ్మెల్యే పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారని సమాచారం.

ఈ నేపథ్యంలో వెంకటేశ్ నేత బీజేపీతో టచ్​లోకి వెళ్లినట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో చుట్టూ నాలుగు సెగ్మెంట్లలో గెలిచి పెద్దపల్లిలో సరైన అభ్యర్థి లేకపోవడం వల్లే ఓడిపోయామని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. కానీ ప్రజల్లో ఆదరణ లేని వ్యక్తిని బరిలోకి దించితే మరోసారి ఓడిపోక తప్పదన్న భయం కమల దళంలో కనిపిస్తోంది. వెంకటేశ్ నేత పాత పరిచయాలతో కాంగ్రెస్​లో చేరడానికి ట్రై చేస్తున్నాడనే ప్రచారం జరుగుతున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అదంత సులభం మాత్రం కాదనే వాదనలు వినిపిస్తున్నాయి.