
- కారులో హైదరాబాద్కు తీసుకెళ్తుండగా తూప్రాన్ టోల్ప్లాజా వద్ద తప్పించుకున్న హరీశ్కుమార్
- మామడ మండలం పొన్కల్ గ్రామంలో ఘటన
నిర్మల్, వెలుగు : నిర్మల్ జిల్లా మామడ మాజీ ఎంపీపీ, ఉమ్మడి ఆదిలాబాద్ డీసీసీబీ డైరెక్టర్, బీఆర్ఎస్ నాయకుడు చిక్యాల హరీశ్కుమార్ను ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. కారులో హైదరాబాద్కు తీసుకెళ్తుండగా.. తూప్రాన్ టోల్ప్లాజా వద్దకు రాగానే చాకచక్యంగా తప్పించుకున్నారు. వివరాల్లోకి వెళ్తే... మామడ మండలం పొన్కల్ గ్రామంలోని హరీశ్కుమార్ ఇంటికి శనివారం అర్ధరాత్రి రెండు గంటలకు నలుగురు గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి ఆయనను బలవంతంగా కారులో ఎక్కించుకున్నారు. రూ. 3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కారులోనే హైదరాబాద్ వైపు తీసుకెళ్లారు. కిడ్నాపర్ల డిమాండ్ మేరకు హరీశ్కుమార్ కారులో నుంచే తన సన్నిహితులకు ఫోన్ చేసి డబ్బు కావాలని కోరారు.
ఈ క్రమంలో కారు తూప్రాన్ టోల్ప్లాజా వద్ద ఆగింది. ఇదే అదనుగా భావించిన హరీశ్కుమార్ కారు డోర్ తీసుకొని ఒక్కసారి బయటకు వచ్చి గట్టిగా అరవడంతో టోల్ప్లాజా సిబ్బంది కారు వద్దకు వచ్చారు. దీంతో షాక్కు గురైన కిడ్నాపర్లు టోల్ గేట్ను ఢీకొడుతూ స్పీడ్గా వెళ్లిపోయారు. తర్వాత హరీశ్కుమార్ టోల్ప్లాజా సిబ్బంది సాయంతో తూప్రాన్ పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. వారు మామడ పోలీసులకు సమాచారం ఇచ్చి... హరీశ్కుమార్ను పోలీసు సిబ్బందితో నిర్మల్కు పంపించారు.
కాగా హరీశ్కుమార్కు తెలిసిన వ్యక్తులే ఈ కిడ్నాప్ చేశారని, ఈ వ్యవహారంలో పొన్కల్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ప్రమేయం కూడా ఉందని, కిడ్నాప్కు ఉపయోగించింది కూడా హరీశ్కుమార్ కారేనని ప్రచారం జరుగుతోంది. హరీశ్కుమార్ కిడ్నాప్ వ్యవహారంపై విచారణ జరుపుతున్నామని, వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని మామడ ఎస్సై అశోక్ తెలిపారు. ప్రస్తుతం తాను సేఫ్గానే ఉన్నానని, ఎవరూ ఆందోళన చెందవద్దని హరీశ్కుమార్ ప్రకటించారు.