కరీంనగర్ సీపీపై కౌశిక్ రెడ్డి ప్రివిలేజ్ మోషన్

కరీంనగర్ సీపీపై కౌశిక్ రెడ్డి ప్రివిలేజ్ మోషన్
  • చర్యలు తీసుకోవాలని స్పీకర్​కు ఫిర్యాదు
  • బలవంతంగా తమను గుడి నుంచి బయటకు లాగేశారని ఆరోపణ
  • ఆఫీసర్లు అడ్డుకోవడంతోనే ఫ్రస్ట్రేషన్​లో అలా మాట్లాడాల్సి వచ్చింది
  • మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: భార్యాపిల్లలతో కలిసి తన సొంతూరులోని సమ్మక్క సారలమ్మ ఆలయ దర్శనానికి వెళ్తే.. కరీంనగర్​ సీపీ గౌస్​ ఆలం, హుజూరాబాద్​ ఏసీపీ మాధవి, జమ్మికుంట రూరల్​ ఇన్​స్పెక్టర్​ లక్ష్మీ నారాయణ తనపట్ల అనుచితంగా ప్రవర్తించి అడ్డుకున్నారని బీఆర్ఎస్​ ఎమ్మెల్యే పాడి కౌశిక్​ రెడ్డి ఆరోపించారు. ఆ అధికారులపై ప్రివిలేజ్​ మోషన్​ పెట్టాలని స్పీకర్​ గడ్డం ప్రసాద్​ కుమార్​ను కోరారు. ఎమ్మెల్యేనని కూడా చూడకుండా అభ్యంతరకరంగా పోలీసులు వ్యవహరించారని, తమను గుడి నుంచి బలవంతంగా, అవమానకరంగా బయటకు లాగేశారని ఆరోపించారు. ప్రొటోకాల్​ను పాటించలేదన్నారు. కారణం లేకుండానే తమను అడ్డుకున్నారన్నారు. ఈ చర్యలన్నీ తన గౌరవాన్ని భంగపరిచేవేనని.. కాబట్టి వారిపై ప్రివిలేజ్​ మోషన్​ పెట్టాలని స్పీకర్​ను కోరారు. 

కావాలని అన్లే..

పోలీసులు, అధికారులంటే తనకు ఎంతో గౌరవమని, వారిని ఉద్దేశపూర్వకంగా మాటలు అనలేదని కౌశిక్​ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. వారి మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలన్నారు. రేవంత్​ రెడ్డి ప్రోద్బలంతోనే తనపై, తన కుటుంబంపై రాజకీయ కక్షకు తెగబడ్డారన్నారు. తాము సమ్మక్క జాతరకు వెళ్తున్న క్రమంలో కొందరు అడ్డుకుని తీవ్ర ఒత్తిడికి గురి చేశారన్నారు. ఆ ఫ్రస్టేషన్, ఒత్తిడిలో తెలియకుండా నోరు జారానే తప్ప కావాలని అన్న మాటలు కాదన్నారు. కానీ, కొందరు కావాలనే పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలన్నారు.