
- బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా విమర్శలు
హైదరాబాద్, వెలుగు: ఫిరాయింపు ఎమ్మెల్యేల తరఫున వచ్చిన అడ్వకేట్ లు తిమ్మిని బమ్మిని చేసే ప్రయత్నం చేశారని బీఆర్ఎస్ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. అసంబద్ధమైన ప్రశ్నలు వేసినా ఓపికతో సమాధానం చెప్పామని తెలిపారు. ఆ పది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరలేదంటూ నిస్సిగ్గుగా చెప్తున్నారని, పార్టీ మారి అధికారాన్ని అనుభవిస్తున్నారని మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించగా.. బీఆర్ఎస్ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, కల్వకుంట్ల సంజయ్, చింతా ప్రభాకర్లు తమ వాదనలు వినిపించారు. తొలిరోజు విచారణ అనంతరం అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడారు.
పది మంది బీఆర్ఎస్ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిన విషయం బహిరంగ రహస్యమని పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. తమ ఫిర్యాదుతో 8 మంది ఎమ్మెల్యేలు స్పీకర్కు వివరణ ఇచ్చారని, సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ విచారణ చేపట్టారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే వారిని అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్కు స్పష్టం చేశామని వెల్లడించారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలన్నారు. కాగా, వాళ్లు పార్టీ మారారని రుజువు చేయడానికి అవసరమైన అన్ని ఆధారాలనూ స్పీకర్కు అందించామని ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ అన్నారు.