కవిత కన్​ఫ్యూజన్​.. అమెరికా నుంచి వచ్చినప్పుడు ఓ తీరు.. ఇప్పుడో తీరు

కవిత కన్​ఫ్యూజన్​.. అమెరికా నుంచి వచ్చినప్పుడు ఓ తీరు.. ఇప్పుడో తీరు
  • సొంత పార్టీ దిశగా అడుగులు వేస్తున్నట్లు మొదట హడావిడి

  • కేసీఆర్​ చుట్టూ దయ్యాలు అంటూ వ్యాఖ్యలు

  • రేవంత్​ కోవర్టులు అంటూ కేటీఆర్ కౌంటర్​​

  • అన్న వ్యాఖ్యలను ఖండించని కవిత

  • ఆయనకు అండగా ట్వీట్లు.. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పోస్టులు

హైదరాబాద్​, వెలుగు: బీఆర్ఎస్​ ఎమ్మెల్సీ కవిత గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తున్నది. అమెరికా నుంచి వచ్చినప్పుడు మాట్లాడిన మాటలకు, ఇప్పుడు సోషల్​ మీడియాలో పెడ్తున్న పోస్టులకు పొంతనలేకపోవడాన్ని బట్టి ఈ విషయం అర్థమవుతున్నదని పార్టీ సీనియర్లలో చర్చ జరుగుతున్నది. ఒకదశలో సొంత పార్టీ ఖాయమన్నట్లుగా హడావిడి చేసిన ఆమె.. అంతలోనే తన అన్న కేటీఆర్​కు అండగా ట్వీట్లు పెట్టారు.  దీంతో ఈ వ్యవహారం ఇంతటితో సద్దుమణుగుతుందని అనుకునేలోపే..  సింగరేణి జాగృతిని ప్రకటించడం ద్వారా మరోసారి కలకలం రేపారు.  దీంతో కవిత పూర్తి కన్ఫ్యూజన్​లో ఉన్నారని, కేసీఆర్ నుంచి పిలుపు కోసమే ఇదంతా చేస్తున్నారనే అభిప్రాయాలు బీఆర్​ఎస్​ నేతల్లో వ్యక్తమవుతున్నాయి.

రోజుకో తీరు

శుక్రవారం (ఈ నెల 23న) అమెరికా నుంచి శంషాబాద్​ఎయిర్​పోర్ట్​లో దిగగానే.. ‘‘కేసీఆర్​చుట్టూ దయ్యాలున్నాయి. వాళ్ల వల్లే నష్టం జరుగుతున్నది’’ అంటూ కవిత కామెంట్లు చేశారు. ఇవి తీవ్ర కలకలం రేపగా.. తర్వాత ఆమె సైలెంట్​అయ్యారు. ఆ మరుసటి రోజే కౌంటర్​ అన్నట్లుగా కేటీఆర్​ మీడియాతో మాట్లాడారు. ‘‘పార్టీలో రేవంత్​రెడ్డి కోవర్టులున్నారు’’ అంటూ ఆయన కామెంట్లు చేశారు. దీనిపై కవిత స్పందించలేదు. మీడియాతో మాట్లాడేందుకుగానీ.. వారిని కలిసేందుకుగానీ ఆసక్తి చూపించలేదు. కాగా, కేసీఆర్​ తనకు అత్యంత సన్నిహితులైన దీవకొండ దామోదర్​ రావు, గండ్ర మోహన్​ రావును సోమవారం కవిత వద్దకు  పంపించారు.

వారు కవితతో మూడు గంటలపాటు సమావేశమై చర్చించారు. కుటుంబ విషయాలు బయట పడేసుకుంటే పార్టీకి నష్టం వాటిల్లుతుందని వారు సూచించినట్టు తెలిసింది. కానీ, తన తండ్రి నుంచి స్పష్టమైన హామీ రావాల్సిందేనని వారికి కవిత తేల్చి చెప్పినట్లు  సమాచారం. అదేరోజు కేటీఆర్​కు ఫార్మూలా ఈ రేసు కేసులో ఏసీబీ నోటీసులు ఇవ్వడాన్ని ఖండిస్తూ కవిత ట్వీట్​ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తూ.. అన్న కేటీఆర్​కు అండగా ఆమె ఆ పోస్టు ఉంది. ఇంతలోనే మంగళవారం సింగరేణి జాగృతి ఏర్పాటును కవిత ప్రకటించారు. సింగరేణిలో ఇప్పటికే  బీఆర్​ఎస్​ అనుబంధం సంస్థ టీబీజీకేఎస్​ ఉండగా.. కవిత కూడా సింగరేణి జాగృతి ప్రకటించడం చర్చకు దారితీసింది.

ఆ వార్తల్లో వాస్తవం లేదు:  కవిత

తాను కాంగ్రెస్​ పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నానంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టంచేశారు. ఈ మేరకు ఆ వార్తకు సంబంధించిన పేపర్​క్లిపింగ్స్​పై ‘ఫేక్​’  సింబల్స్​ జోడించి సోషల్​ మీడియాలో బుధవారం సాయంత్రం 4 గంటలకు పోస్ట్​చేశారు.