- ఆ వంకతో ప్రజలకు అన్యాయం చేయకండి: ఎమ్మెల్సీ కవిత
- జీవో 3 వల్ల ఉద్యోగాల భర్తీలో మహిళలకు అన్యాయం
- కాంగ్రెస్ సర్కారు వెంటనే ఆ జీవోను రద్దు చేయాలని డిమాండ్
- ధర్నాచౌక్ వద్ద దీక్ష
హైదరాబాద్, వెలుగు : గత ప్రభుత్వంలో ఏవైనా తప్పులు, అవినీతి జరిగి ఉంటే ఎంక్వైరీ చేసి సంబంధిత వ్యక్తులను శిక్షించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. తమ ప్రభుత్వ హయాంలో సుమారు 400 పథకాలను అమలు చేశామని, అన్నింటిపైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీ చేసుకున్నా తమకేమీ అభ్యంతరం, నష్టం లేదని అన్నారు. తమపై కోపంతో ప్రజలకు అన్యాయం చేయొద్దని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆమె సూచించారు. రేవంత్ సర్కారు తీసుకొచ్చిన జీవో 3 వల్ల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని అన్నారు. ఈ జీవోను రద్దు చేయాలని, పాత విధానంలోనే ఉద్యోగాల భర్తీ చేపట్టాలని డిమాండ్ చేస్తూ భారత జాగృతి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నాచౌక్లో శుక్రవారం కవిత దీక్ష చేపట్టారు. కవిత మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డికి ఓటుకు నోటు కేసు మీద ఉన్న శ్రద్ధ ఆడపిల్లల ఉద్యోగాలపై లేదని విమర్శించారు. ఈ అంశంపై త్వరలో గవర్నర్ను కలుస్తామని, న్యాయపరంగా కూడా పోరాడుతామని ఆమె ప్రకటించారు.
33 నుంచి 12 శాతానికి తగ్గింపు
పీవీ నరసింహారావు దేశ ప్రధానిగా ఉన్నప్పుడు 1996లో మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించారని కవిత గుర్తు చేశారు. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన రిక్రూట్మెంట్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించామని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏండ్లనుంచి ఉన్న మహిళల హక్కులను కొల్లగొట్టిందని ధ్వజమెత్తారు. హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసును రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉపసంహరించుకుందని, 33 శాతం రిజర్వేషన్లను హరిస్తూ జీవో 3ను జారీ చేసిందని మండిపడ్డారు. గురుకులాల నియామకాల్లో జీవో 3ను అమలు చేయడం వల్ల మహిళలకు కేవలం 12 శాతం ఉద్యోగాలే వచ్చాయని అన్నారు. ఇక ముందు వచ్చే నోటిఫికేషన్లలో కూడా పరిస్థితి ఇలానే ఉండబోతున్నదని తెలిపారు. జీవోను రద్దు చేసే వరకు పోరాటం కొనసాగుతుందని, ముఖ్యమంత్రిని నిద్రపోనివ్వబోమని తేల్చిచెప్పారు. గురుకులా నియామకాల్లో దివ్యాంగులకు ఇవ్వాల్సిన 4 శాతం రిజర్వేషన్లు కూడా ఇవ్వలేదని కవిత ఆరోపించారు.
మహిళలను వంటింటికే పరిమితం చేస్తరా?
మహిళలకు రూ.500కే సిలిండర్ ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ చెప్పిందని, అంటే మహిళలకు ఉద్యోగాలను ఎగరగొట్టి వంటింట్లో కూర్చోబెట్టాలనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ ఆ హామీ ఇచ్చిందని కవిత పేర్కొన్నారు. ‘సోనియాగాంధీ, ప్రియాంకాగాంధీ మాత్రం పార్లమెంటుకు వెళ్లాలి. తెలంగాణ మహిళలు మాత్రం వంటింటికి పరిమితం కావాలా’ అని ఆమె ప్రశ్నించారు. ‘సీఎం రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులో దొరికిన వ్యక్తి. ఆ కేసులో హైకోర్టులో ఓడిపోతె సుప్రీంకోర్టుకు పోతాడు. అక్కడ వ్యతిరేకంగా వస్తే రివ్యూ పిటిషన్ వేస్తాడు. కానీ, ఆడపిల్లల కేసు విషయంలో మాత్రం ఎవరినీ సంప్రదించలేదు. ఓటుకు నోటు కేసు మీద ఉన్న శ్రద్ధ ఆడపిల్లల ఉద్యోగాల విషయంలో ఎందుకు లేదు’ అని రేవంత్కు కవిత చురకలంటించారు. కార్యక్రమంలో జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజుల సురేందర్ పాల్గొన్నారు.