BJPలో బీఆర్ఎస్ పార్టీ విలీనం ఆలోచన చేశారు: కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణ

BJPలో బీఆర్ఎస్ పార్టీ విలీనం ఆలోచన చేశారు: కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణ

హైదరాబాద్: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చిట్చాట్లో తాజాగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేసే ప్లాన్ జరిగిందని, తాను వద్దని వాదించానని కవిత సంచలన ఆరోపణ చేశారు. కేసీఆర్కు కాళేశ్వరం విషయంలో నోటీసులు వస్తే పార్టీలో చర్చ జరగలేదని, ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేయలేదని కవిత చెప్పారు.

బీఆర్ఎస్ పార్టీ కేవలం ట్వీట్స్ కే పరిమితం అయిందని ఆమె ఎద్దేవా చేశారు. తాను రాసిన లేఖ గురించి మాట్లాడుతూ.. తన డాడీకి మాత్రమే లేఖ రాశానని, పార్టీ అధ్యక్షుడికి కాదని కవిత చెప్పడం కొసమెరుపు. తన డాడీకి తాను 100 లేఖలు రాసుకుంటానని, మీకొచ్చిన నష్టం ఏంటని కవిత నిలదీశారు. పార్టీలో చాలా విషయాలు చర్చిస్తానని ఆమె కుండబద్ధలు కొట్టారు. కేసీఆర్కు నోటీస్ వస్తే పార్టీ ఏం చేసిందని ఆమె ప్రశ్నించారు.

తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చితే ట్విటర్ లో పోస్టులు చేసి వ్యతిరేకిస్తే సరిపోతుందా అని ఆమె విస్మయం వ్యక్తం చేశారు. తనపై విమర్శలు చేసే వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహం మార్చితే ఏం చేశారని కవిత మండిపడ్డారు. ఎక్కడిక్కడ ఉద్యమం జరగాలని కానీ పార్టీలో అలా జరిగిందా అని ఆమె నిలదీశారు.

బీఆర్ఎస్ రజతోత్సవ సభ కేసీఆర్ వల్లనే సక్సెస్ అయిందని, కొంత మంది తమ వల్లనే సభ సక్సెస్ అయిందని చెప్పుకుంటున్నారని చిట్ చాట్లో కవిత చెప్పారు. బీజేపీ వాళ్ళు హాస్పిటల్ పెడితే వెళ్ళింది ఎవరని, తాను అలా వెన్నుపోటు రాజకీయాలు చేయనని కవిత చెప్పుకొచ్చారు. డేర్గా మాట్లాడుతానని, నల్లి కుట్ల రాజకీయాలు చేయనని.. లేఖ రాసింది ఎవరో తెలవాలని ఆమె డిమాండ్ చేశారు. పెయిడ్ పోస్ట్లతో బదనాం చేస్తే ఊరుకోనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హెచ్చరించారు.