
- తమ కేసుతో ‘వీ6 వెలుగు’కు ఎలాంటి సంబంధం లేదన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్
హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓ కేసుకు సంబంధించి హైడ్రా ఇచ్చిన ప్రకటనలో ఉన్న ‘వెలుగు’ అనే పదాన్ని పట్టుకొని ‘వీ6 వెలుగు’పై సోషల్ మీడియాలో బీఆర్ఎస్కు చెందిన ఓ వర్గం విషప్రచారం చేస్తోంది. నిజానికి హైడ్రా చెప్పిన ‘వెలుగు’కు ‘వీ6 వెలుగు’కు ఎలాంటి సంబంధం లేదు.
జీహెచ్ఎంసీ పరిధిలోని తుక్కుగూడ మున్సిపాలిటీకి చెందిన మంఖాల్ గ్రామంలో ‘వర్టెక్స్ రియల్ ఎస్టేట్’ అనే సంస్థ లే ఔట్ వేసింది. ఈ క్రమంలో అక్కడి సూరం చెరువును ఆక్రమించినట్టు ఫిర్యాదు అందడంతో హైడ్రా కేసు నమోదుచేసింది. సదరు వర్టెక్స్వెంచర్లో తన స్థలాన్ని ఆక్రమించి రోడ్డు వేశారంటూ చైతన్యారెడ్డి అనే వ్యక్తి సైతం ఫిర్యాదు చేయడంతో హైడ్రా అధికారులు విచారణ ప్రారంభించారు.
హైడ్రా అధికారులతో మాట్లాడి రోడ్డును తొలగిస్తామంటూ ఇద్దరు యూట్యూబ్చానల్ రిపోర్టర్లతో పాటు ఓ లీగల్ అడ్వయిజర్ కలిసి తన వద్ద రూ.50 లక్షలు తీసుకున్నారని చైతన్యారెడ్డి చెప్పారు. దీంతో ఆ ముగ్గురిపై కేసు నమోదు చేసిన హైడ్రా అధికారులు గత గురువారం మీడియాకు ప్రెస్నోట్విడుదల చేశారు.
సదరు యూట్యూబ్చానల్పేరులోనూ ‘వెలుగు’ అనే పదం ఉండడంతో హైడ్రా అధికారులు అత్యుత్సాహంతో ‘వెలుగు’లోకి వచ్చిన రిపోర్టర్ల దందా.. అనే హెడ్లైన్తో ఇచ్చిన ఆ ప్రెస్ నోట్ను పలు పత్రికలు ప్రచురించాయి. సోషల్మీడియా చానళ్లు సైతం ప్రసారం చేశాయి.
దీంతో వీ6 వెలుగు ప్రతినిధులే ఈ దందాకు పాల్పడుతున్నారనే అర్థం వచ్చేలా బీఆర్ఎస్కు చెందిన గ్రూపులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నాయి. దీనిపై హైడ్రా చీఫ్ రంగనాథ్ను వివరణ కోరగా.. తమ పొరపాటుకు చింతిస్తున్నామని, తాము కేసుపెట్టిన యూట్యూబ్ చానల్ రిపోర్టర్లతో ‘వీ6 వెలుగు’కు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. రూ.50 లక్షల వ్యవహారానికి సంబంధించిన అంశంపై విచారణ కొనసాగుతోందని వివరించారు. రెండు రోజుల్లో పూర్తి వివరాలు తెలియజేస్తామని ఆయన వెల్లడించారు.