వెయ్యి కేసులు పెట్టుకో వంద సిట్లు వేసుకో: కేటీఆర్

వెయ్యి కేసులు పెట్టుకో వంద సిట్లు వేసుకో: కేటీఆర్
  • కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నోటీసులిచ్చినా భయపడేది లేదు: కేటీఆర్​
  • ఫోన్​ ట్యాపింగ్​.. ఓ లొట్టపీసు కేసు
  • అసెంబ్లీలో మంత్రులతోనే హరీశ్​ ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్​ ఆడుకుండు
  • ఐదుగురు ఆఫీసర్లు ఆయన్నేం చేస్తరని కామెంట్

హైదరాబాద్, వెలుగు: వెయ్యి కేసులు పెట్టినా.. వంద సిట్లు వేసుకున్నా తాము భయపడబోమని బీఆర్ఎస్‌‌‌‌ వర్కింగ్‌‌‌‌ ప్రెసిడెంట్​ కేటీఆర్​ అన్నారు.  ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో హరీశ్‌‌‌‌ రావు సిట్​ విచారణ నేపథ్యంలో మంగళవారం  తెలంగాణ భవన్‌‌‌‌లో   మీడియాతో కేటీఆర్‌‌‌‌‌‌‌‌ మాట్లాడారు. సీఎం రేవంత్​ బామ్మర్ది బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టడంతోనే హరీశ్‌‌‌‌ను సిట్​ విచారణ పేరిట వేధింపులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు. అసెంబ్లీలో 8 మంది మంత్రులతోనే హరీశ్​ సింగిల్‌‌‌‌గా ఫుట్‌‌‌‌బాల్​ ఆడుకున్నాడని, ఇప్పుడు ఐదుగురు అధికారులు ఆయన్నేం చేయగలరని అన్నారు. ఫోన్​ ట్యాపింగ్​ కేసు ఒక లొట్టపీసు కేసని అన్నారు.  ‘‘ఇలాంటి కేసులో కేసీఆర్​కు నోటీసులిస్తరట.. ఇస్తే ఇచ్చుకో.. ఏం చేస్కుంటవో చేస్కో ” అని వ్యాఖ్యానించారు.  

సింగరేణి టెండర్లను రిగ్గింగ్​ చేసిన్రు

సింగరేణి టెండర్లను రేవంత్‌‌‌‌రెడ్డి బామ్మర్ది సుజన్‌‌‌‌రెడ్డి  రిగ్గింగ్​ చేశారని కేటీఆర్​ ఆరోపించారు. హరీశ్​ బయటపెట్టిన బొగ్గు స్కామ్​ సమాచారం తప్పయితే సంబంధిత మంత్రి, సింగరేణి అధికారులు ఇప్పటిదాకా ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఇప్పటిదాకా రేవంత్​ కుటుంబం 9 సింగరేణి టెండర్లను నియంత్రించిందని ఆరోపించారు. ఎన్నడూ లేనివిధంగా.. అంచనా విలువ కన్నా మైనస్‌‌‌‌లో టెండర్లు పడే చోట.. ప్లస్​లో టెండర్లు ఎలా పడ్డాయని అడిగారు. సీఎం బామ్మర్ది సుజన్‌‌‌‌రెడ్డి స్వయంగా అందరినీ బెదిరిస్తున్నారన్నారు. అర్హులైన కంపెనీలకు సైట్​ విజిట్​ సర్టిఫికెట్​ ఇవ్వడం లేదన్నారు.  భట్టి విక్రమార్క రద్దు చేశామని చెబుతున్న  నైనీ కోల్​ బ్లాక్స్​ టెండర్​ వెనుక కూడా అక్రమ దందా నడుస్తున్నదని ఆరోపించారు. సింగరేణి దొంగతనంలో బీజేపీకి సంబంధం లేకుంటే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. కోల్​ మినిస్టర్​ కిషన్‌‌‌‌రెడ్డి స్వయంగా బాధ్యత తీసుకోవాలని, ఈ అంశంపై సుప్రీంకోర్టు సిట్టింగ్​ జడ్జితో విచారణ జరిపించాలన్నారు.  రేవంత్​ ఆడుతున్న రాజకీయ ఆటలో పోలీసు అధికారులు కచ్చితంగా బలవుతారని అన్నారు. ఇప్పుడు రెచ్చిపోతున్న పోలీసు అధికారులను రిటైర్​ అయినా వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు.