
- ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ అండతోనే దాడులు చేస్తున్నారన్న దివాకర్రావు
- నిందితులను అరెస్ట్ చేయాలని మంచిర్యాల పీఎస్ ఎదుట ధర్నా
మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లాకు చెందిన బీఆర్ఎస్వీ నాయకుడు దగ్గుల మధుపై కొందరు వ్యక్తులు గురువారం రాత్రి దాడికి పాల్పడ్డారు. అయితే ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు సపోర్ట్తో జగన్మోహన్రావు అనుచరులే దాడులకు పాల్పడుతున్నారంటూ మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆధ్వర్యంలో శుక్రవారం పోలీస్స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.
బాధితుడు మధు తెలిపిన వివరాల ప్రకారం... నస్పూర్ ఫ్లడ్ కాలనీకి చెందిన బీఆర్ఎస్వీ లీడర్ దగ్గుల మధు, కాంగ్రెస్ నాయకుడు, నస్పూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ సురిమిల్ల వేణు కలిసి గురువారం రాత్రి బైపాస్ రోడ్లోని కాంగ్రెస్ నాయకుడు జగన్మోహన్రావు ఇంటికి వెళ్లారు. అక్కడ మధుపై దాడి జరగడంతో అతడు తప్పించుకున్నాడు. అయితే ఆరుగురు వ్యక్తులు తనపై దాడి చేశారని, సురిమిల్ల వేణు ప్లాన్ ప్రకారమే తనను జగన్మోహన్రావు ఇంటికి తీసుకెళ్లి దాడి చేయించాడని మధు ఆరోపించాడు.
దాడి విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు, బీఆర్ఎస్ లీడర్లు మంచిర్యాల పీఎస్ ఎదుట ధర్నాకు దిగారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్రావు సపోర్టుతోనే దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మధుపై దాడి చేసిన వ్యక్తులతో పాటు దానికి కారణమైన వేణును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పోలీసులు వారిని స్టేషన్లోకి లాక్కెళ్లారు.
దాడి వ్యవహారంలో పరసర్పరం ఫిర్యాదుతో ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినట్లు మంచిర్యాల టౌన్ సీఐ ప్రమోద్రావు తెలిపారు. మధు ఫిర్యాదుతో సురిమిల్ల వేణు, పాదం కుమార్, అరిక రాకేశ్, గుర్రాల వంశీ, ఆత్మకూరి సంజీవ్, దీటి సాయితో పాటు మరికొందరిపై కేసు పెట్టామన్నారు. తమను బూతులు తిడుతూ చేయిచేసుకున్నాడని జగన్మోహన్రావు డ్రైవర్ వినయ్ ఫిర్యాదుతో మధుపైనా కేసు నమోదు చేశామని తెలిపారు.
విజిత్రావునూ కొడుతాం : సురిమిల్ల వేణు
మధుపై దాడి విషయంలో బీఆర్ఎస్ నాయకులు విజిత్రావు చేసిన ఆరోపణల్లో నిజం లేదని, అసత్యాలు చెప్పడం మానుకోకుంటే విజిత్రావు సైతం కొడుతామని సురిమిల్ల వేణు హెచ్చరించారు. తాను జగన్ మోహన్రావు ఇంటి వద్దకు వెళ్లే సరికే మధు అక్కడ గొడవ పడుతున్నాడని, అతడిని అక్కడి నుంచి తానే తప్పించానని చెప్పారు.