న్యూఢిల్లీ: టీ+0 (అదే రోజు ట్రేడ్ సెటిల్మెంట్) విధానాన్ని అమలు చేయడానికి ఎన్ఎస్ఈ, బీఎస్ఈ సిద్ధమయ్యాయి. కొన్ని షేర్లలో గురువారం నుంచి బీటా వెర్షన్ను అమలు చేయనున్నారు. అంటే ఈ షేర్లను కొనుగోలు చేస్తే అదే రోజు ఇన్వెస్టర్ల డీమాట్ అకౌంట్లకు ఇవి యాడ్ అవుతాయి. ట్రేడర్ల ప్రాఫిట్, లాస్ కూడా అదే రోజు సెటిల్ అవుతాయి.
ఇప్పటికే అందుబాటులో ఉన్న టీ+1 (ట్రేడ్ జరిగిన రోజు + ఒక రోజు) విధానానికి ఇది అదనం. మొదట టీ+0 విధానం 25 కంపెనీల షేర్ల కోసం అందుబాటులో ఉంటుంది. అది కూడా కొన్ని బ్రోకరేజ్ కంపెనీలే ఈ ఫెసిలిటీ ఆఫర్ చేస్తున్నాయి. ట్రేడ్ జరిగిన రోజే సెటిల్మెంట్ పూర్తయితే ఖర్చు తగ్గుతుందని, టైమ్ కలిసొస్తుందని ఎనలిస్టులు భావిస్తున్నారు. ఛార్జీలలో పారదర్శకత పెరుగుతుందని, క్లియరింగ్ కార్పొరేషన్ల రిస్క్ మేనేజ్మెంట్ మెరుగవుతుందని పేర్కొన్నారు.
బజాజ్ ఆటో, వేదాంత, హిందాల్కో ఇండస్ట్రీస్, ఎస్బీఐ, ట్రెంట్, టాటా కమ్యూనికేషన్స్, నెస్లే ఇండియా, సిప్లా, ఎంఆర్ఎఫ్, జేఎస్డబ్ల్యూ స్టీల్, బీపీసీఎల్, ఓఎన్జీసీ, ఎన్ఎండీసీ, అంబుజా సిమెంట్ తదితర షేర్ల కోసం టీ+0 విధానం అందుబాటులో ఉంటుంది. ఇన్వెస్టర్లందరూ ఈ విధానం కింద ట్రేడ్ చేయడానికి అర్హులు. ట్రేడ్ టైమింగ్ ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 1.30 మధ్య ఉండాలి.