నెక్కొండ, వెలుగు: మధ్యాహ్న భోజనం సరిపోక కొంతమంది విద్యార్థులకు అరటిపండ్లు ఇచ్చిన ఘటన వరంగల్ జిల్లా నెక్కొండ టౌన్ హైస్కూల్లో జరిగింది. ఈ విషయంపై ఎంఈవో రవికుమార్ సోమవారం విచారణ చేపట్టారు. ఎంఈవో తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం పాఠశాలలో 74 మంది విద్యార్థులు హాజరుకాగా, 63 మందికి మాత్రమే సరిపడా భోజనం వండారు.
మిగిలిన విద్యార్థులకు అన్నం లేకపోవడంతో అరటిపండ్లు ఇచ్చారు. ఈ ఘటనపై హెచ్ఎం శ్రీదేవి, మధ్యాహ్న భోజన సిబ్బందిని వివరణ కోరినట్లు ఎంఈవో తెలిపారు. ఇకపై ఇలాంటి ఘటనలు పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇదే పాఠశాలలో పదో తరగతి విద్యార్థిని బయోసైన్స్ టీచర్ కొట్టడంతో తల్లిదండ్రులు వచ్చి గొడవ చేశారు. గాయపడిన విద్యార్థిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు.
