
- జమ్మూలో పాక్ కాల్పుల్లో అమరుడైన బీఎస్ఎఫ్ ట్రూపర్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ కాల్పుల్లో మరో బీఎస్ఎఫ్ జవాన్ వీరమరణం పొందాడు. అమరుడైన జవాన్ ను కానిస్టేబుల్ దీపక్ చిమన్ గాఖంగా గుర్తించారు. ఈనెల 10న జమ్మూ జిల్లాలోని ఆర్ఎస్ పురా ఏరియాలో అంతర్జాతీయ సరిహద్దుల వద్ద పాక్ కాల్పుల విరమణను ఉల్లంఘించింది. అదేపనిగా కాల్పులు జరపడంతో దీపక్ తీవ్రంగా గాయపడి వీరమరణం పొందాడని బీఎస్ఎఫ్ అధికారులు ఆదివారం సోషల్ మీడియా ద్వారా తెలిపారు.
కాగా, శనివారం పాక్ కాల్పుల్లో బీఎస్ఎఫ్కు చెందిన 8 మంది ట్రూపర్లు గాయపడ్డారు. ఎస్ఐ మొహమ్మద్ ఇంతియాజ్ తీవ్రంగా గాయపడి చనిపోయారు. ఆదివారం జమ్మూలోని పలౌర్మాలో బీఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ వద్ద మిలిటరీ లాంఛనాలతో ఇంతియాజ్ అంత్యక్రియలు నిర్వహించారు.