రేపు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న హరీశ్రావు
బడ్జెట్కు నేడు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర
రైతు సంక్షేమానికే బడ్జెట్లో ప్రయారిటీ
హైదరాబాద్, వెలుగు: కిందటేడాది కంటే మెరుగైన బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర సర్కారు ఎక్సర్సైజ్ పూర్తి చేసింది. రూ.1.55 లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్టు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వర్గాలు పేర్కొంటున్నాయి. మాంద్యం వెంటాడుతున్నా గతేడాది ప్రవేశపెట్టిన బడ్జెట్ కన్నా ఈసారి పది శాతం అదనంగా పద్దు ఉండనుంది. శనివారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించే సమావేశంలో బడ్జెట్ ప్రతిపాదనలకు కేబినెట్ ఓకే చెప్పనుంది. ఆదివారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి టి.హరీశ్రావు, కౌన్సిల్లో అసెంబ్లీ ఎఫైర్స్ మంత్రి ప్రశాంత్రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
రైతు పక్షపాతిగానే..
గత బడ్జెట్ల తరహాలోనే ఈ యేటి పద్దు కూడా రైతు పక్షపాతిగానే ఉండే అవకాశం ఉంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు, రైతుబంధు, బీమా, అగ్రి సబ్సిడీలు, ఇతరత్రా అన్ని రకాల కేటాయింపులు కలిపి బడ్జెట్లో 20 శాతానికిపైగా ఉండనున్నట్టు తెలిసింది. 57 ఏళ్ల వారికి ఆసరా పింఛన్లు ఇచ్చేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేసే అవకాశముంది. పింఛన్లకు రూ.10 వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండనున్నాయి. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలకు రూ.7 వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండొచ్చని సమాచారం. కరెంట్ సబ్సిడీలు, ఇతర కేటాయింపులకు రూ.10 వేల కోట్ల వరకు ఇచ్చే అవకాశముంది. రైతు రుణాలు త్వరలోనే మాఫీ చేయనున్నామని మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు చెపుతున్న నేపథ్యంలో రుణమాఫీకి రూ.6 వేల కోట్ల వరకు కేటాయింపులు ఉండనున్నట్టు తెలుస్తోంది.
అభివృద్ధికి మిగిలేది అంతంతే..
వెల్ఫేర్ స్కీములతోపాటు ప్రభుత్వ నిర్వహణ, జీతాలు, పెన్షన్లు ఇతరత్రా వ్యయానికి రూ.47 వేల కోట్లు మినహాయిస్తే14 శాతం బడ్జెట్టే అభివృద్ధి పనులకు వ్యయం చేసే పరిస్థితి. లోన్లు కూడా పెద్దగా వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రోడ్లు, ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సంబంధించిన పనులకు పెద్దగా కేటాయింపులు ఉండే ఆస్కారం లేదని సమాచారం. డబుల్ ఇండ్ల నిర్మాణానికి మాత్రం రూ.2 వేల కోట్ల వరకు పెట్టవచ్చని తెలుస్తోంది. నిరుద్యోగ భృతికి ఈ బడ్జెట్లోనూ కేటాయింపులు అంతగా ఉండకపోవచ్చని సమాచారం.
రూ.12 వేల కోట్ల మేర పెంపు
2019–20 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1,43,133 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టింది. అంతకుముందు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను రూ.1,82,017 కోట్లతో పెట్టింది. ఆర్థిక మాంద్యం, కేంద్రం నుంచి వచ్చే నిధుల్లో కోతను సాకుగా చూపి వాస్తవ బడ్జెట్కు వచ్చే సరికి రూ.38,884 కోట్ల మేర కోత పెట్టింది. రాష్ట్ర వృద్ధి రేటు 17% నుంచి ఆరు శాతానికి పడిపోయినా, ఈ ఏడాది రూ.70 వేల కోట్ల వరకు స్టేట్ ఓన్ రెవెన్యూ ఉండే అవకాశమున్నట్టు తెలుస్తోంది. కేంద్రం నుంచి వచ్చే పన్ను వాటాల్లో ఒక శాతం మేర కోత పెడుతూ 15వ ఆర్థిక సంఘం సిఫార్సు చేసింది. 2020–21 సెంట్రల్ బడ్జెట్లో రాష్ట్రానికి రూ.29,030.58 కోట్లు కేటాయించారు. సెంట్రల్ జీఎస్టీ, కార్పొరేట్ ట్యాక్స్, ఇన్కం ట్యాక్స్, కస్టమ్స్, ఎక్సైజ్ డ్యూటీ, సర్వీస్ ట్యాక్స్ రూపేణ ఈ ఆదాయం రాష్ట్రానికి సమకూరనుంది. పన్నుల్లో వాటా ఒక శాతం తగ్గినా 2019–20 ఆర్థిక సంవత్సరంతో పోల్చితే కేంద్రం నుంచి వచ్చే నిధులు రూ.739 కోట్ల మేర పెరిగింది.
నేడు, రేపు ప్రశ్నోత్తరాలు లేవ్
అసెంబ్లీలో శనివారం, ఆదివారం క్వశ్చన్ అవర్ జరగదని తెలుస్తోంది. శనివారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలపటంతోపాటు సీఎం కేసీఆర్ సభకు సమాధానం ఇవ్వనున్నారు. అనంతరం సభ వాయిదా పడనుంది. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం వాయిదా పడనుంది. సోమ, మంగళవారాలు సభకు విరామం ఇచ్చారు.
ఇరిగేషన్ ప్రశ్నలకు హరీశ్ ఆన్సర్లు
ఇరిగేషన్పై అసెంబ్లీ, కౌన్సిల్లో సభ్యులు అడిగే ప్రశ్నలకు మంత్రి హరీశ్రావు ఆన్సర్లు చెప్పనున్నారు. సీఎం కేసీఆర్ వద్దే ఇరిగేషన్ శాఖ ఉండటంతో ఈ శాఖకు సంబంధించిన ప్రశ్నలు, చర్చకు హరీశ్ సమాధానం చెప్పనున్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు.