- ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్తోనే 95% ప్రమాదాలు
- హైవేలపై సగటున కిలో మీటర్కో యాక్సిడెంట్
- సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్యే ఎక్కువ
- స్టేట్ రోడ్ సేఫ్టీ గణాంకాల్లో వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే 95 శాతం రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. 10 నెలల్లో జరిగిన 7,333 యాక్సిడెంట్లలో 2,702 మంది చనిపోయారు. ఇందులో 6,982 ప్రమాదాలకు ఓవర్ స్పీడ్, ర్యాష్ డ్రైవింగే కారణమని స్టేట్ రోడ్ సేఫ్టీ గణాంకాలు చెప్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 6,417 కిలో మీటర్ల పొడవునా నేషనల్, స్టేట్హైవేస్ ఉండగా, సగటున ప్రతీ కిలో మీటర్కు ఒక రోడ్డు ప్రమాదం జరుగుతున్నది. మితిమీరిన వేగం.. ఎదుటి వారి ప్రాణాలు తీస్తున్నది.
డ్రంకెన్ డ్రైవ్ తోనూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయని పోలీసులు, ట్రాన్స్పోర్ట్ శాఖ అధికారులు చెప్తున్నారు. హైవేలపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు, కార్లు గంటకు 100 కిలో మీటర్ల స్పీడ్తో వెళ్తున్నాయి. ఆర్టీసీ బస్సులు, ట్రక్కులు, టిప్పర్లు కూడా 60 నుంచి 80 కిలో మీటర్ల వేగానికి తగ్గడం లేవు.
మూలమలుపులు, యూటర్న్ల వద్ద, జనావాసాల్లోనూ అదే స్పీడ్తో వెళ్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా బస్సులు, లారీలు, కార్లు ఓవర్స్పీడ్ గా వెళ్తుండటంతో బైకులపై ప్రయాణిస్తున్నవారు పెద్దసంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. సైన్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడం, స్పీడ్ గన్లు లేకపోవడంతో వెహికల్స్ స్పీడ్గా వెళ్తున్నాయి. సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య ఎక్కువ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అయితే, అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.
ప్రతిపాదనలకే పరిమితమైన రోడ్ సేఫ్టీ
రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాల నివారణకు నేషనల్, స్టేట్ హైవేస్పై 50 రోడ్ సేఫ్టీ పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని అధికారులు గతంలో ప్రతిపాదనలు రూపొందించారు. పోలీస్ స్టేషన్లకు అవసరమైన వాహనాల కొనుగోలు, లేజర్ గన్స్, స్పీడ్ గన్స్ సదుపాయాలను కల్పించాలని సూచించారు. కానీ, ఏండ్లు గడుస్తున్నా ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు.
