GHMC బడ్జెట్ రూ.7,937 కోట్లు

GHMC బడ్జెట్ రూ.7,937 కోట్లు
  •     2024–25 ఏడాదికి  కౌన్సిల్​ ఏకగ్రీవంగా ఆమోదం
  •     శానిటేషన్, అడ్వర్టైజ్ మెంట్ పై హౌస్ కమిటీ ఏర్పాటుకు నిర్ణయం
  •     రెండోరోజు జరిగిన కౌన్సిల్​సమావేశంలో మేయర్​ప్రకటన

హైదరాబాద్,వెలుగు:  గ్రేటర్​హైదరాబాద్​మున్సిపల్​కార్పొరేషన్​ 2024–25 ఏడాదికి రూపొందించిన అంచనా బడ్జెట్​ రూ. 7,937 కోట్లకు ఆమోదం తెలిపింది. రెండో రోజు మంగళవారం ఉదయం మేయర్​ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ మీటింగ్ ప్రారంభమైంది. ముందుగా సభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టగా..  దీన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించారు. దీంతో  బడ్జెట్ కు ఏకగ్రీవ ఆమోదించినట్లు మేయర్ సభలో ప్రకటించారు. అలాగే.. శానిటేషన్​, అడ్వర్టయిజ్​మెంట్ విభాగాల తీరుపై హౌస్​ కమిటీ వేస్తామని ప్రకటించారు. అసెంబ్లీ బడ్జెట్​లో 1,100కోట్లు కేటాయించినందున కౌన్సిల్​లో  ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మరో రూ. 3,500 కోట్లను ప్రభుత్వం నుంచి నిధులను కోరాలని కూడా నిర్ణయించారు. బల్దియా మేజర్ ఆదాయ వనరు పన్ను వసూళ్లని, ఆస్తి పన్ను సక్రమంగా వసూలు చేయాలని, బకాయిలపై దృష్టి సారించాలని సభ్యులు కోరారు. ఆన్ లైన్​ సెల్ఫ్ అసెస్ మెంట్ ఆఫ్ ప్రాపర్టీ టాక్స్ విధానం పై వివరణ కోరగా సంబంధిత అధికారులు వివరించారు. ఆస్తి పన్ను చెల్లింపులకు వన్ టైం సెటిల్ మెంట్  స్కీమ్  మళ్లీ అమలు చేయాలని, అందుకు కమిషనర్ ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని కార్పొరేటర్లు మేయర్ ను కోరారు.

గత సర్కార్ పట్టించుకోకనే అప్పులు

కాంగ్రెస్​ హయాంలో బల్దియా నిధుల్లో బడ్జెట్​ఉండేదని కాంగ్రెస్​కార్పొరేటర్​రజితారెడ్డి గుర్తు చేశారు. గత సర్కార్ పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రభుత్వ ఆస్తి పన్నులు సైతం సరిగా చెల్లించలేదన్నారు. 9 ఏండ్లలో బీఆర్ ఎస్ ప్రభుత్వం బల్దియాకు రూ. 1,776 కోట్లు మాత్రమే నిధులు ఇచ్చిందన్నారు. దీంతో రూ. 7,113 కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం రోజుకు 1.30 కోట్లు వడ్డీ చెల్లించాల్సి వస్తుందన్నారు.   – రజితారెడ్డి, కాంగ్రెస్​కార్పొరేటర్

వెయ్యి కోట్లే పెరిగింది

గతేడాది బడ్జెట్​తో పోలిస్తే కేవలం వెయ్యికోట్లు మాత్రమే ప్రస్తుతం పెరిగిందని -బీజేపీ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి పేర్కొన్నారు.  మిగులు బడ్జెట్​ఉన్నా బల్దియా ఇప్పుడు అప్పుల్లో ఉందన్నారు.  ప్రాపర్టీ ట్యాక్స్, టౌన్​ప్లానింగ్​ నుంచి ఆదాయం రాకపోతే జీతాలు కూడా అందని పరిస్థితి ఉందన్నారు.  ఇప్పటికైనా సీఎంతో మాట్లాడి నిధులు తీసుకురావాలని కోరారు. 
– కొప్పుల నర్సింహారెడ్డి , బీజేపీ కార్పొరేటర్

అభివృద్ధిని కూడా చూడాలి

గత ప్రభుత్వం అన్నప్పుడు విమర్శలు కాదు, చేసిన అభివృద్ధిని కూడా చూడాలని బీఆర్ఎస్​కార్పొరేటర్ మన్నె కవిత రెడ్డి అన్నారు. కేటీఆర్​డెవలప్​చేసినందుకే సిటీలో అన్నిసీట్లను సాధించామన్నారు. – మన్నె కవిత రెడ్డి, బీఆర్ఎస్​కార్పొరేటర్

ఒక్కొక్కరిపై వందల కోట్ల అప్పులు

  బల్దియా అప్పులను చూస్తే.. ఒక్కో ఎమ్మెల్యేపై  రూ. 296 కోట్ల అప్పులు ఉన్నాయన్నారు. బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు గెలిచేందుకు ఈ అప్పులే కారణమని కాంగ్రెస్​ కార్పొరేటర్ రాజశేఖర్​రెడ్డి మండిపడ్డారు. 
– రాజశేఖర్​రెడ్డి , కాంగ్రెస్​కార్పొరేటర్

అక్రమ నిర్మాణాలపై దృష్టిపెట్టాలి

టౌన్​ప్లానింగ్​ నుంచి వచ్చే ఆదాయం ముఖ్యమైనదని, అక్రమ నిర్మాణాలతో కొందరు కోట్లు దండుకున్నారని శేరిలింగంపల్లి కార్పొరేటర్​ జగదీశ్వర్​గౌడ్​అన్నారు.  వాటిపై దృష్టిపెట్టి ఆదాయాన్ని పెంచేందుకు కృషి చేయాలని సూచించారు. 
 – జగదీశ్వర్​గౌడ్, శేరిలింగంపల్లి కార్పొరేటర్​

డెవలప్ మెంట్ పైనా ఫోకస్ పెట్టాలి

బడ్జెట్​పెట్టుకోవడం కాదు, డెవలప్​మెంట్ పైనా ఫోకస్​ చేయాలని బీజేపీ కార్పొరేటర్ శ్రీనివాస్​రెడ్డి పేర్కొన్నారు. బల్దియాలో అభివృద్ధికి కేంద్రం నుంచి రూ. 3 వేల కోట్లు వచ్చాయన్నారు. 
– శ్రీనివాస్​రెడ్డి , బీజేపీ కార్పొరేటర్

రూ. 450 కోట్లతో ఏడాదంతా ఎలా నడుస్తుంది?

బడ్జెట్​పై కౌన్సిల్​లో వివిధ పార్టీల సభ్యుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. బడ్జెట్​లో క్లారిటీ లేదని, 3,646 కోట్ల ఆదాయం చూపించారని,  అన్ని ఖర్చులు కలిపి 3,500కోట్లు అవుతుందని మజ్లిస్ నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్​హుస్సేన్​పేర్కొన్నారు. మిగిలినవి450 కోట్లు మాత్రమేనని వాటితో ఏడాదంతా జీహెచ్​ఎంసీ నడుస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. ఆదాయం కంటే ఖర్చులే అధికంగా ఉన్నాయని, ప్రభుత్వం 3 వేల కోట్లు పెట్టాలని ఉన్నా రూ. 11 కోట్లు మాత్రమే ఇచ్చారన్నానరు. అప్పులు, రుణాలు చూసిన తర్వాత బల్దియా పటిష్టంగా ఉందని ఎలా నమ్మాలంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు.    – మజ్లిస్ నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్​హుస్సేన్​