న్యూఢిల్లీ: టీ20 వరల్డ్కప్ ప్రిపరేషన్లో ఉన్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలు కనబడుతున్నాయి. వెన్ను నొప్పితో ఆసియా కప్కు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. మెగా టోర్నీకి కూడా అందుబాటులో ఉండే చాన్స్ కనిపించడం లేదు. 2019లో అయిన వెన్ను గాయం మళ్లీ తిరగబెట్టిందని సమాచారం. దీంతో టీ20 వరల్డ్కప్కు మరో రెండు నెలలే సమయం ఉండటంతో అటు బీసీసీఐ, ఇటు సెలెక్టర్లు ఆందోళనలో పడ్డారు. ‘బుమ్రా గాయం తీవ్రంగా మారింది. ప్రస్తుతం అతను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో రిహాబిలిటేషన్లో ఉన్నాడు. అత్యుత్తమ వైద్య సలహాలను తీసుకుంటున్నాడు. పాత గాయం మళ్లీ తిరగబెట్టడం సమస్యగా మారింది.
మాకు రెండు నెలలే టైమ్ ఉండటంతో ఏటూ తేల్చుకోలేకపోతున్నాం. వరల్డ్ బెస్ట్ బౌలర్ కావడంతో ప్రతి అంశాన్ని చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నాం’ అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నాడు. మరోవైపు యంగ్ పేసర్ హర్షల్ పటేల్ కూడా పక్కటెముకల గాయంతో ఇబ్బందిపడుతున్నాడు. దీని కారణంగా ఆసియాకప్కు దూరమయ్యాడు. తను ఎప్పటిలోపు కోలుకుంటాడో క్లారిటీ లేదు. ఒకవేళ ఈ ఇద్దరూ దూరమైతే సీనియర్ పేసర్ షమీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది.