ఇల్లెందులో రెండు ఇండ్లలో చోరీ

ఇల్లెందులో రెండు ఇండ్లలో చోరీ

ఇల్లెందు, వెలుగు : రెండు ఇండ్లలో చోరీ జరిగింది. ఈ ఘటన ఇల్లెందు మండల పరిధిలో ఆదివారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..  మండలంలోని తిలక్ నగర్ పంచాయతీలో నివాసముంటున్న సింగరేణి ఉద్యోగి రవి తన కుటుంబ సభ్యులతో కలిసి మేడారం జాతరకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉన్నాయి. బీరువాలోని 15 గ్రాముల బంగారం, 50 తులాల వెండి కనిపించలేదు. బాధితుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

పట్టణంలోని 8వ వార్డులో నివాసముంటున్న ప్రభుత్వ ఉద్యోగి రాధాకృష్ణ కూడా ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లాడు. ఇంటికి వచ్చి చూడగా తన ఇల్లు తెరిచి ఉంది. ఇంట్లోని 8 తులాల బంగారం దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసులు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.