
గువాహటి: బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ చాంపియన్షిప్లో ఇండియా బోణీ చేసింది. సోమవారం జరిగిన గ్రూప్–హెచ్ తొలి మ్యాచ్లో 45–18, 45–17తో నేపాల్పై గెలిచింది. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో ఇండియా ప్రయోగాత్మక లైనప్తో బరిలోకి దిగి విజయం సాధించింది. డబుల్స్ జోడీ భార్గవ్ రామ్ అరిగెలా–విశ్వ తేజ్ గొబ్బురు 9–3తో కబీర్ కేసీ–సుప్రీమ్ పాంటాపై గెలిచి శుభారంభం చేశారు.
గర్ల్స్ సింగిల్స్ మ్యాచ్ల్లో ఉన్నతి హుడా, తన్వి శర్మ విజయాలు సాధించారు. మరో డబుల్స్ మ్యాచ్లో సుయాన్ష్ రావత్–రౌనక్ చౌహాన్ తమ ప్రత్యర్థులపై ఈజీగా నెగ్గారు. ఈసారి కొత్తగా బెస్టాఫ్ త్రీ రిలే స్కోరింగ్ ఫార్మాట్లో టోర్నీని నిర్వహిస్తున్నారు. ప్రతి మ్యాచ్లో మూడు సెట్లు ఉంటాయి. గరిష్టంగా 45 పాయింట్లు సాధించాలి. ప్రతి సెట్లో ఐదు మ్యాచ్లు ఉంటాయి. ఇందులో మెన్స్, విమెన్స్ సింగిల్స్, డబుల్స్, మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్లు ఆడిస్తారు. ప్రతి సెట్లో ప్లేయర్లను మార్చుకునే అవకాశం ఇస్తారు.