న్యూఢిల్లీ: కంపెనీ బోర్డు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్న ముగ్గురు గ్లోబల్ ఇన్వెస్టర్లను వెళ్లొద్దని బైజూస్ కోరుతోంది. తాజాగా కంపెనీ ఆడిటర్ రాజీనామా చేయడంతో బైజూస్ ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలిసిందే. సెకోయీ క్యాపిటల్ ఇండియా, ప్రోసస్, చాన్ జూకర్బర్గ్ ఇనీషియేటివ్కు చెందిన రిప్రెజెంటేటివ్స్ తాజాగా కంపెనీ బోర్డ్ నుంచి ఎటువంటి కారణం చెప్పకుండానే తప్పుకున్నారు. కంపెనీ ఆడిటర్ డెలాయిట్ ఈ నెల 22 న తన బాధ్యతల నుంచి తప్పుకుంది. అదే రోజున పైన పేర్కొన్న ముగ్గురు బోర్డ్ డైరెక్టర్లు కూడా తప్పుకోవడం గమనించాలి.
2021–22 కి సంబంధించిన కంపెనీ తన ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ను ఇవ్వడంలో ఆలస్యం చేస్తోందని, ఆడిటర్ చాలాసార్లు బోర్డుకి లెటర్స్ రాసినా డాక్యుమెంట్లను ప్రొవైడ్ చేయడం లేదని డెలాయిట్ పేర్కొంది. బైజూస్ టాప్ మేనేజ్మెంట్ మాత్రం రాజీనామా చేసిన డైరక్టర్లను తప్పుకోవద్దని బ్రతిమాలుతోంది. కాగా, బైజూస్ గత ఏడాది కాలంగా ఇబ్బందుల్లో ఉంది. ఉద్యోగులను పెద్ద మొత్తంలో తీసేస్తోంది. మనీలాండరింగ్కు పాల్పడిందనే ఆరోపణలపై మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ రేడార్లో ఉందని కూడా ఆరోపణలు వస్తున్నాయి.