
న్యూఢిల్లీ: స్టూడెంట్స్ లెర్నింగ్ మాడ్యూల్స్లో జెనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అందుబాటులోకి తెచ్చినట్లు బైజూస్ ప్రకటించింది. టెక్నాలజీ టీచర్లకు ప్రత్యామ్నాయం కాదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. బైజూస్ విజ్ సూట్ – బద్రి, మ్యాథ్ జీపీటీ, టీచర్ జీపీటీల పేరుతో మూడు ఏఐ మోడల్స్ను బైజూస్ పరిచయం చేసింది. స్టూడెంట్లు ఏ విధంగా నేర్చుకుంటున్నారో తెలుసుకోవడానికి ఈ ఏఐ మోడల్స్ సాయపడతాయని, దాని ఆధారంగా వారి లెర్నింగ్ ప్రాసెస్ మరింత మెరుగుపడేలా తాము ప్రయత్నించడానికి వీలవుతుందని బైజూస్ పేర్కొంది. టీచర్లను పక్కకు పెట్టే ఉద్దేశంతో ఏఐ తేవడం లేదని, ఆర్గనైజేషన్లో ఎఫిషియన్సీ పెంచడం కోసమేనని బైజూస్ కో–ఫౌండర్ దివ్య గోకుల్నాథ్ వెల్లడించారు. మరింత విలువైన అంశాలపై టీచర్లు ఫోకస్ పెట్టడానికి ఇది అవకాశం కల్పిస్తుందని వివరించారు. టీచర్లకు ఏఐ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాలేదని పేర్కొన్నారు. ఏఐ మాడ్యూల్ తేవడం వల్ల కంపెనీ రెవెన్యూ, మార్జిన్లు మెరుగుపడతాయని చెప్పారు. టీచర్లు మరింత బెటర్ టీచర్లుగా మారేందుకు ఏఐ ని వాడుకోవచ్చని అన్నారు.