హైవే విస్తరణకు అడుగులు .. ఫోర్ లేన్‌‌గా మార్చేందుకు ప్రతిపాదనలు

హైవే విస్తరణకు అడుగులు .. ఫోర్ లేన్‌‌గా మార్చేందుకు ప్రతిపాదనలు
  • మెదక్ పట్టణం వద్ద బైపాస్ రోడ్డు కు ప్లాన్

మెదక్, వెలుగు: హైదరాబాద్ శివారు గండి మైసమ్మ నుంచి మెదక్ వరకు టూ లేన్ గా ఉన్న నేషనల్ హైవే 675డి ని ఫోర్ లేన్  గా విస్తరించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఈ పనులకు ఆమోదం వస్తుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావ్ ప్రకటించారు. హైవే విస్తరణ, బైపాస్ రోడ్డుకు ఆమోదం లభించి, నిధులు మంజూరు అయితే ప్రమాదాలకు చెక్ పడనుంది. 

హైదరాబాద్ లోని బాలానగర్​నుంచి వయా నర్సాపూర్​ మీదుగా మెదక్ వరకు ఉన్న రోడ్డు స్టేట్​హైవే 6గా ఉండేది. మెదక్ జిల్లాలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఉండటం, ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాలోని బోధన్​, బాన్సువాడ డిపోల ఆర్టీసీ బస్సులు ఎక్కువ శాతం ఈ రూట్లోనే రాకపోకలు సాగిస్తుండటంతో రద్దీ బాగా పెరిగింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ రోడ్డును 2017లో నేషనల్​ హైవేగా గుర్తించింది.  స్టేట్​హైవేగా ఉన్న ఈ రోడ్డును బాలానగర్​ నుంచి మెదక్ పట్టణం వరకు నేషనల్​ హైవేగా విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపి 765 డి నెంబర్​కేటాయించింది. 

హైవేకు  రూ. 320 కోట్లు మంజూరు కాగా 2018లో బాలానగర్​ నుంచి మెదక్ వరకు కిలోమీటర్ల దూరం హైవే రోడ్డు నిర్మాణ పనులు మొదలై 2020లో పూర్తయ్యాయి. ఈ రూట్‌‌‌‌లో సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల వరకు, ఆ తర్వాత నర్సాపూర్​ పట్టణం, కౌడిపల్లి మండలం వెంకట్రావ్​పేట, మండల కేంద్రమైన కౌడిపల్లి, కొల్చారం, అప్పాజిపల్లి, పోతంశెట్​ పల్లి చౌరస్తా, మెదక్​ మండలం మంబోజిపల్లి వద్ద మాత్రమే ఫోర్​ లైన్​ రోడ్డు నిర్మించి, మధ్యలో డివైడర్​, ఇరువైపులా డ్రైనేజీ నిర్మించి రెయిలింగ్​ ఏర్పాటు చేశారు.  మిగతా రోడ్డు మొత్తం టూ లేన్​ రోడ్డుగానే నిర్మించారు. గుమ్మడిదల నుంచి నర్సాపూర్​వరకు మూల మలుపులు ఉన్నప్పటికీ అటవీశాఖ నుంచి అనుమతి లేదని రెండు వరుసలుగానే రోడ్డు నిర్మించారు. 

రద్దీ పెరిగి అనేక ప్రమాదాలు

నేషషనల్​ హైవే రోడ్డు నిర్మాణం జరిగిన తర్వాత ఐదేళ్లలో బాలానగర్ - మెదక్ రూట్లో వాహనాల రద్దీ బాగా పెరిగింది. పట్టణాలు, గ్రామాలు ఉన్న చోట మాత్రమే ఫోర్​ లేన్​ రోడ్డు ఉండి, మిగితా అంతా టూ లేన్​ రోడ్డు ఉండటం వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. నేషనల్ హైవే కావడం వల్ల వాహనాలు చాలా స్పీడ్​గా వెళ్తున్నాయి. ఈ క్రమంలో రెండు వరుసల రోడ్డు ఉన్న చోట తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. గుమ్మడిదల, నర్సాపూర్​ మధ్యలో, నర్సాపూర్​మండలం పెద్ద చింతకుంట, చిన్న చింతకుంట, రెడ్డిపల్లి, కౌడిపల్లి మండలం తునికి, రాయిలాపూర్​, నాగ్సానిపల్లి,  ధర్మాసాగర్​ గేట్​, కొల్చారం మండలం లోతువాగు వద్ద ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఏటా కనీసం పది మంది మృత్యువాత పడుతున్నారు. 

మెదక్  లో ట్రాఫిక్​ ఇబ్బందులు..

జిల్లా కేంద్రమైన మెదక్ పట్టణం మీదుగా ఒకే ఒక రోడ్డు ఉంది.  హైదరాబాద్​, బోధన్​, నిజామాబాద్, సిద్దిపేట, సంగారెడ్డి, నర్సాపూర్​, చేగుంట, బీదర్ వైపు వెళ్లాలన్నా, ఏ వాహనమైనా పట్టణం మధ్యలో నుంచే  వెళ్లాలి.  వివిధ డిపోల ఆర్టీసీ బస్సులు, కార్లు, జీపులు, బైక్​లు, వివిధ రాష్ట్రాలకు ముడిసరుకు తీసుకెళ్లే కంటైనర్లు, ఇసుక లారీలు, టిప్పర్లు రాకపోకలు సాగిస్తుండటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి.  పట్టణ పరిధిలో రోడ్డు మీద ఎదైనా ప్రమాదం జరిగినా, ఎవరైనా రాస్తారోకో, ధర్నా చేసినా ట్రాఫిక్​ స్తంభించాల్సిందే.

 బైపాస్​ రోడ్డు లేకపోవడంతో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో బైపాస్​ రోడ్డు నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించారు.  నేషనల్​ హైవే అథారిటీ సర్వే నిర్వహించి  బైపాస్​ ఎక్కడ నుంచి నిర్మించేందుకు అవకాశం ఉంది.  ఎన్ని కిలోమీటర్లు వస్తుంది అనేది గుర్తించనున్నారు.  హైవేను మొత్తం ఫోర్​ లైన్​గా విస్తరించేందుకు, మెదక్ బైపాస్​ రోడ్డు నిర్మించేందుకు కేంద్రం నుంచి నిధులు మంజురైతే వాహనదారుల ఇబ్బందులు దూరమవుతాయి.