
దేశంలో టీవీ ఛానళ్ల అప్ లింకింగ్, డౌన్ లింకింగ్ కు సంబంధించిన మార్గదర్శకాలకు కేంద్ర ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. కొత్త మార్గదర్శకాలు టీవీ ఛానళ్ల సమ్మతిని సులభతరం చేస్తాయని I&B సెక్రెటరీ అపూర్వ చంద్ర అన్నారు. ఈవెంట్ల ప్రత్యక్ష ప్రసారానికి ముందస్తు అనుమతి లేదని స్పష్టం చేశారు. భారతీయ టెలిపోర్ట్లు విదేశీ ఛానళ్లను అప్లింక్ చేయొచ్చన్నారు. జాతీయ, ప్రజా ప్రయోజనాలలో కంటెంట్ను ప్రసారం చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. 11 సంవత్సరాల తర్వాత కొత్త మార్గదర్శకాలను విడుదల చేశామని తెలిపారు.
కేంద్ర మంత్రివర్గం ఆమోదం తీసుకున్నాక ఈ కొత్త నిబంధనలను తీసుకొచ్చామని అపూర్వ చంద్ర వెల్లడించారు. టీవీ రంగంలో వ్యాపారాన్ని సులభతరం చేసే విషయంలో తాము అనేక మెరుగుదలలు చేశామన్నారు. జాతీయ ప్రాముఖ్యత లేదా జాతీయ ఆసక్తి ఉన్న విషయాల కోసం 30 నిమిషాల స్లాట్ ఇవ్వాలనే నిబంధనను తీసుకొచ్చామని తెలిపారు. మహిళా సాధికారత, వ్యవసాయం, బోధన వంటి విభాగాల్లో 7 నుంచి 8 థీమ్లు ఇచ్చామని వివరించారు.