తప్పని పరిస్థితిలో మార్కెట్కు పచ్చి వడ్లు
ఎండబెట్టి తీసుకెళ్లినా సవాలక్ష రూల్స్
పాస్బుక్కు, బ్యాంక్ అకౌంట్ ఉండాల్సిందే
అవి లేనోళ్లు తక్కువ రేటుకే దళారులకు అమ్మకం
ఆఫీసర్లు రూల్స్ పేరుతో కొంచెం పచ్చిగున్నా వడ్లు కొంటలేరు.
మార్కెట్ నుంచి తీసుకెళ్లలేక రైతులు తక్కువకే దళారులకు అమ్ముకుంటున్నరు.
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వరి కోతలు మొదలయ్యాయి. బావులు, బోర్ల కింద కుప్పలు కొట్టడం పూర్తవడంతో ధాన్యం మార్కెట్కు వస్తోంది. నాట్లు ఆలస్యంగా పడినచోట పంట చివరి దశలో ఉంది. వ్యవసాయ మార్కెట్లలో కొనుగోళ్లు ప్రారంభంకాగా, పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో సగం కొనుగోలు కేంద్రాలే మొదలయ్యాయి. రాష్ట్రంలో ఈ ఏడాది 3,406 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా ఇప్పటివరకు 1,447 కేంద్రాల్లో వడ్లు కొంటున్నారు. తేమ 17 శాతానికి మించితే కొనొద్దని అధికారుల చెప్పడంతో నిర్వాహకులు ఆ మేరకు కొనడం లేదు.
దీంతో కిరాయి పెట్టుకుని మార్కెట్ వరకు తీసుకెళ్లిన వడ్లను తిరిగి ఇంటికి తెచ్చుకోలేక ఎంతకోఒకంతకు దళారులకు అమ్ముకుని రైతులు ఇంటిబాట పడుతున్నారు. ఈ ఏడాది 34 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. గత ఏడాది కంటే ఇది 8 లక్షల ఎకరాలు ఎక్కువ. మద్దతు ధర వడ్లు సాధారణ రకం క్వింటాలుకు రూ.1,815, గ్రేడ్ ‘ఏ’ రకానికి రూ.1,835గా నిర్ణయించారు. ఈ రేట్లు గత ఏడాది కంటే 3.71 శాతం ఎక్కువ. ఈ ఏడాది 40 లక్షల మెట్రిక్ టన్నులకుపైగా వడ్లు కొనాలని అధికారులు టార్గెట్గా పెట్టుకున్నారు.
కోత మిషన్లతో పచ్చి వడ్లే..
కూలీలు దొరక్క రైతులు కోత మిషన్లతో కోయిస్తున్నారు. దీంతో పచ్చి వడ్లే వస్తున్నాయి. వాటిని కాంటా వేసుకోవడానికి వ్యాపారులు ముందుకురాకపోవడంతో కల్లాల్లోనే ఎండబోస్తున్నారు. నాలుగైదు రోజులు వాటికి కాపలా ఉండాల్సి రావడంతోపాటు ఆ సమయంలో వానలు పడతాయేమోనని ఆందోళన చెందుతున్నారు.
ఇబ్బంది పెడుతున్న రూల్స్
కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు రైతుల పట్టాదారు పుస్తకం, ఆధార్, బ్యాంకు ఖాతా వివరాలు ట్యాబ్లో అప్లోడ్ చేస్తేనే వడ్లను కాంటా వేయడానికి వీలుంది.
ఇప్పటివరకు రాష్ట్రంలో 8 లక్షల మందికిపైగా రైతులకు పాస్బుక్కులు అందలేదు.
కౌలు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల్లేవు. పోడు రైతులకు హక్కుపత్రాలు లేవు. వీళ్లతోపాటు పాస్ పుస్తకాలు లేనివారు ఏఈఓ, రైతు సమన్వయ సమితి నుంచి ధ్రువపత్రం తీసుకురావాల్సి ఉంటుంది.
ఇవన్నీ తేలేక రైతులు దళారుల వద్దకు వెళ్తున్నారు. వాళ్లు రూ.1,200 నుంచి రూ.1,400కు మించి రేటు పెట్టడంలేదు. ఇక కొందరు రైతులు ఇతరుల పాస్బుక్కుల మీద అమ్ముకుంటున్నారు.
తేమ 17శాతం లోపే ఉండాలి
కొనుగోళ్లు, చెల్లింపులు ఆన్లైన్లో జరుగుతున్నాయి. రైతులు ఇబ్బందులుంటే టోల్ ఫ్రీ నంబర్ 1800 425 00333, వాట్సాప్ నంబర్ 7330774444లను అందుబాటులోకి తీసుకువచ్చాం. కేంద్రం నిబంధనలకు అనుగుణంగా ధాన్యంలో తేమ శాతం 17% లోపే ఉండాలి.
– మారెడ్డి శ్రీనివాస్రెడ్డి, చైర్మన్, పౌరసరఫరాలశాఖ