నేను బెదిరించాకే యుద్ధం ఆపారు: భారత్-పాక్ వార్‎పై ట్రంప్ మరోసారి మొండివాదన

నేను బెదిరించాకే యుద్ధం ఆపారు: భారత్-పాక్ వార్‎పై ట్రంప్ మరోసారి మొండివాదన

వాషింగ్టన్: భారత్, పాక్ కాల్పుల విరమణపై అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మరోసారి మొండివాదన చేశారు. తన వల్లే భారత్, పాక్ యుద్ధం ముగించాయని పాత చింతకాయ పచ్చడి తరహాలో మళ్లీ అవే కామెంట్స్ చేశారు. శనివారం (జూన్ 28) వైట్ హౌస్ వద్ద ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ.. యుద్ధం ఆపకపోతే భారత్, పాకిస్తాన్ దేశాలతో అన్ని వాణిజ్య సంబంధాలను పూర్తిగా రద్దు చేసుకుంటానని బెదిరించా.. దీంతో ఆ రెండు దేశాలు వెంటనే వార్ ఆపేశాయని తెలిపారు. తద్వారా భారత్, పాక్ మధ్య నెలకొన్న యుద్ధం.. న్యూక్లియర్ వార్ వైపు వెళ్లకుండా ఆపగలిగానని పేర్కొన్నారు. 

‘‘యుద్ధాన్ని కొనసాగిస్తే ట్రంప్ రెండు దేశాలతో అన్ని వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలనుకుంటున్నారని భారత్, పాకిస్తాన్‌లకు ఫోన్ చేసి చెప్పమని అధికారులను ఆదేశించా.. వెంటనే ఆ రెండు దేశాలు తిరిగి నాకు ఫోన్ చేసి పోరాటం ఆపేశాయి’’ అని అన్నారు ట్రంప్. భారత్, పాక్ మధ్య అణు యుద్ధాన్ని ఆపి గొప్ప పని చేశా.. ఇంతకంటే ఎక్కువ మంచి చేసిన అధ్యక్షుడు ఎవరైనా ఉన్నారో లేదో నాకు తెలియదని ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సెర్బియా, కొసావో దేశాలు కూడా యుద్ధానికి కాలు దువ్వుతుంటే.. భారత్, పాక్ మాదిరిగానే ఆ రెండు దేశాలను కూడా వాణిజ్యం పూర్తిగా తెంచేసుకుంటామని హెచ్చరించానని చెప్పారు. దీంతో సెర్బియా, కొసావో దేశాలు యుద్ధం జోలికి పోలేదన్నారు.

కాగా, భారత్, పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో ఏ మధ్యవర్తి ప్రమేయం లేదని.. కేవలం ద్వైపాక్షిక చర్చల ద్వారానే సైజ్ ఫైర్ కుదిరిందని భారత్ ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పింది. తన వల్లే భారత్, పాక్ యుద్ధం ఆగిందన్న ట్రంప్ వ్యాఖ్యలను ఇండియా బహిరంగంగా ఖండించింది. ఇదే విషయమై భారత్ ప్రధాని మోడీ కూడా ట్రంప్ తో మాట్లాడారు. ఇండియా, పాక్ మధ్య సైజ్ ఫైర్ విషయంలో మూడో పక్ష జోక్యం లేదని.. కేవలం ద్వైపాక్షిక చర్చలు మాత్రమే జరిగాయని ట్రంప్ కు చెంప దెబ్బ కొట్టినట్లుగా సమాధానం చెప్పారు. అయినప్పటికీ ట్రంప్ మళ్లీ అదే వాదన చేస్తున్నారు. మరీ ట్రంప్ వ్యాఖ్యలపై భారత్ ఈ సారి ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.