జిల్లాల్లోనూ క్యాన్సర్ ట్రీ‌‌ట్‌‌మెంట్

జిల్లాల్లోనూ క్యాన్సర్ ట్రీ‌‌ట్‌‌మెంట్
  • తొలుత 5 సెంటర్లు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం
  • కొత్తగూడెం, ఆదిలాబాద్, మహబూబ్‌‌నగర్, సంగారెడ్డి,  కరీంనగర్‌‌లో‌‌ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసిన అధికారులు
  • వరంగల్‌‌లో ఎంఎన్‌‌జే స్థాయి హాస్పిటల్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హైదరాబాద్‌‌కే పరిమితమైన క్యాన్సర్  వైద్య సేవలను జిల్లాలకు కూడా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్, రంగారెడ్డి మినహా అన్ని ఉమ్మడి జిల్లాల్లో క్యాన్సర్  రీజనల్  సెంటర్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ఇందులో భాగంగా మొదటి దశలో కొత్తగూడెం, ఆదిలాబాద్‌‌, మహబూబ్‌‌నగర్‌‌‌‌, సంగారెడ్డి, కరీంనగర్‌‌‌‌లో సెంటర్లను నెలకొల్పాలని యోచిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒక్కో సెంటర్‌‌‌‌ను సుమారు రూ.50 కోట్లతో ఆధునిక వసతులతో నిర్మించనున్నారు. ఆ తర్వాత రెండో దశలో మిగిలిన జిల్లాల్లో సెంటర్లను అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తున్నారు. క్యాన్సర్  లక్షణాలను గుర్తించడం, స్ర్కీనింగ్  చేయడం, ఆయా జిల్లాల్లో ఉన్న క్యాన్సర్ పేషెంట్లకు ఎంఎన్‌‌‌‌జే హాస్పిటల్‌‌‌‌  డాక్టర్లు సూచించిన ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ను అందించడం వంటివి ఈ సెంటర్ల ప్రథమ లక్ష్యం. ఇందుకోసం ఆయా సెంటర్లలో ఆంకాలజిస్టులు, రేడియాలజిస్టులను నియమించడంతో పాటు, జిల్లా హాస్పిటళ్లలో పనిచేసే డాక్టర్లు, సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తారు. అవసరమైన ఎక్విప్‌‌మెంట్ ఏ ర్పాటు చేస్తారు. అలాగే, వరంగల్‌‌లో ఇప్పటికే ఉన్న రీజనల్  క్యాన్సర్‌‌‌‌  సెంటర్‌‌‌‌ను హైదరాబాద్‌‌లోని ఎంఎన్‌‌జే తరహాలో పూర్తి స్థాయి వైద్యసేవలు అందేలా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ఆరోగ్యశాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. 

సరిపోని ఎంఎన్‌‌జే

రాష్ట్రంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్నా.. ప్రభుత్వ క్యాన్సర్  హాస్పిటళ్ల సంఖ్య మాత్రం పెరగడం లేదు. మొదటి ప్రధాని జవహర్‌‌‌‌‌‌‌‌లాల్  నెహ్రూ 1955లో ప్రారంభించిన ఎంఎన్‌‌‌‌జే  క్యాన్సర్  హాస్పిటల్ ఒక్కటే రోగులకు ఇప్పటికీ అండగా నిలుస్తోంది. ఇది తప్ప మరో క్యాన్సర్  హాస్పిటల్‌‌‌‌ను మన పాలకులు ఏర్పాటు చేయలేదు. రాష్ట్రంలోని 4 కోట్ల మందికి ఈ ఆస్పత్రే దిక్కు. ప్రస్తుతం ఎంఎన్‌‌జేలో 750 బెడ్లు ఉన్నా, పేషెంట్ల రద్దీకి అవి సరిపోవడం లేదు. దీంతో డే కేర్ సిస్టమ్‌‌‌‌ను తీసుకొచ్చారు. కీమోథెరపీ చేయించుకున్న పేషెంట్లను ఒకట్రెండు గంటలు అబ్జర్వేషన్‌‌‌‌లో ఉంచి, అదే రోజు సాయంత్రానికల్లా డిశ్చార్జ్  చేస్తున్నారు. తెలంగాణతో పాటు సరిహద్దు రాష్ట్రాలైన ఏపీ, కర్నాటక, మహారాష్ట్ర, ఛత్తీస్‌‌‌‌గఢ్‌‌‌‌  నుంచి కూడా ఇక్కడికి పేషెంట్లు వస్తున్నారు. రోజూ 650 నుంచి 700వరకూ ఓపీ కేసులు నమోదవుతున్నాయి. వరంగల్‌‌లో రీజనల్  క్యాన్సర్ ఉన్నప్పటికీ, అక్కడ పూర్తి స్థాయిలో వైద్యసేవలు అందడం లేదు. ఈ నేపథ్యంలోనే ఆ హాస్పిటల్‌‌ను అప్‌‌గ్రేడ్  చేయడంతో పాటు, రీజనల్  క్యాన్సర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది.

పెరుగుతున్న రోగుల సంఖ్య

రాష్ట్రంలో క్యాన్సర్‌‌  బాధితుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఐసీఎంఆర్‌‌‌‌  ఆధ్వర్యంలోని నేషనల్  క్యాన్సర్‌‌‌‌  రిజిస్ర్టీ ప్రోగ్రామ్‌‌ (ఎన్‌‌సీఆర్పీ) అంచనా ప్రకారం మన రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 150 నుంచి 160 మంది క్యాన్సర్‌‌ బారినపడుతున్నారు. రాష్ట్రంలో 2016లో కొత్తగా 43,129 క్యాన్సర్  కేసులు రిజిస్టర్  అయ్యాయి. 2018 నాటికి ఈ సంఖ్య 52,000కు పెరిగింది. రాష్ట్రంలో 2,030 నాటికి ప్రతి సంవత్సరం 65,000 మందికి క్యాన్సర్  డయాగ్నసిస్‌‌  అయ్యే అవకాశం ఉందని ఐసీఎంఆర్  అంచనా వేసింది. క్యాన్సర్  కారణంగా ఏటా సుమారు 20 వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ సంఖ్య ఇంకా ఎక్కువయ్యే ప్రమాదాలు ఉన్నాయని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. మన రాష్ట్రంలో దాదాపు 60 శాతం క్యాన్సర్లకు లైఫ్‌‌ స్టైల్‌‌లో వచ్చిన మార్పులు, పొల్యూషనే కారణం అని డాక్టర్లు చెబుతున్నారు.