వలస ఓటర్లపై కన్ను

వలస ఓటర్లపై కన్ను
  • హైదరాబాద్, తదితర చోట్ల ఉంటున్న వారి వివరాల సేకరణ
  • పోలింగ్ రోజు రప్పించేందుకు ఏర్పాట్లు
  • ఛార్జీలు, ఖర్చులు  భరించేందుకు రెడీ

మెదక్, వెలుగు: అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా మెజారిటీ ఓట్లు సాధించేందుకు ప్రధాన పార్టీల అభ్యర్థులుఅన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కో ఓటు ఎంతో కీలకమైనదిగా భావిస్తున్నారు. ఇందుకోసం ఎవరినీ వదలొద్దని డిసైడ్ అయ్యారు. ఓ వైపు పాదయాత్రలు, ఇంటింటి ప్రచారాల ద్వారా స్థానికంగా ఉంటున్న ఓటర్ల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు ఉద్యోగం, వ్యాపారం, ఉపాధి, ఉన్నత చదువుల కోసం హైదరాబాద్, తదితర ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ఓటర్లపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరిస్తున్నారు.

హైదరాబాద్​ చుట్టుపక్కల ప్రాంతాల్లో..

జిల్లాలోని మెదక్, నర్సాపూర్, దుబ్బాక, గజ్వేల్​నియోజకవర్గ పరిధిలోని పట్టణాలు, ఆయా మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన అనేక కుటుంబాలు ఉద్యోగాలు, ఉపాధి, పిల్లల ఉన్నత చదువుల కోసం హైదరాబాద్​చుట్టుపక్కల ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు. ప్రధానంగా ఉద్యోగులు, టీచర్లు, సాఫ్ట్​వేర్​ఇంజనీర్లు, బిజినెస్​మెన్​, ప్రైవేట్​ఎంప్లాయిస్​, ఆయా కంపెనీల్లో, అపార్ట్​మెంట్లలో పనిచేస్తున్నవారు హైదరాబాద్​నగర శివార్లలోని కొంపల్లి, సుచిత్ర, అల్వాల్,​ బొల్లారం, చింతల్, బాల్​నగర్, జగద్గిరిగుట్ట, బాచుపల్లి, నిజాంపేట, మియాపూర్, కూకట్​పల్లి, బీరంగూడ, అమీన్​పూర్​ ఏరియాల్లో ఉంటున్నారు. 

గ్రామాలు, వార్డుల వారీగా..

వలస ఓటర్లపై కన్నేసిన క్యాండేట్లు స్థానిక నేతల ద్వారా ఓటరు లిస్టులు పరిశీలిస్తూ  హైదరాబాద్​, తదితర చోట్ల ఉంటున్న ఓటర్లు ఎవరనేది పరిశీలిస్తున్నారు. ఎవరెవరు, ఎక్కడెక్కడ ఉంటున్నారని ఆరా తీస్తున్నారు. వారందరినీ  పోలింగ్ రోజు రప్పించే బాధ్యతను లోకల్​ లీడర్లకు అప్పగిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారి సెల్​ఫోన్​ నెంబర్లు సేకరించి రెండు మూడు రోజులకు ఒకసారి వారితో మాట్లాడే ఏర్పాటు చేశారు. వారికి వాట్సప్ మెసేజ్ లు పంపుతున్నారు. కచ్చితంగా ఓటు వేసి వెళ్లాలని అభ్యర్థిస్తున్నారు.  

వెహికల్, బస్​చార్జీలు ఇస్తాం

పోలింగ్ రోజు సొంత ఊర్లకు వచ్చి ఓటు వేసేందుకు వీలుగా హైదరాబాద్, తదితర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లకు పార్టీ లీడర్లు వెహికల్స్​ ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. ఐదు, పది మందికి ఒక వెహికల్​ చొప్పున ఏర్పాటు చేస్తామని అంటున్నారు. ఒకరిద్దరు ఉంటే వారికి రాను పోను బస్​చార్జీలు చెల్లిస్తామని చెబుతున్నారు. ఇలా ఏ ఒక్క ఓటరు మిస్​ కాకుండా అందరూ ఓటేసేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  పొలిటికల్​ లీడర్లు గెలవడానికి ఏ ఒక్క అవకాశాన్ని మిస్​ చేసుకోవడం లేదు.