
బాలీవుడ్ హీరో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించిన చిత్రం ‘థామ’(Thama). ఈ మూవీ రోజు (2025 అక్టోబర్ 21న) ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో హారర్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్గా తెరకెక్కించాడు. తెలుగులో కూడా విడుదలైంది. బాక్సాపీస్ వద్ద మిశ్రమ స్పందనను అందుకుంటోంది. అయితే తన తదుపరి చిత్రం 'ది గర్ల్ఫ్రెండ్' ప్రమోషన్స్లో లేటెస్ట్ గా పాల్గొంది. దీనిలో భాగంగా ప్రేమ, బ్రేకప్లపై రష్మిక చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
లవ్ బ్రేకప్ విషయంలో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువగా బాధపడతారనే అంశంపై రష్మిక తనదైన శైలిలో స్పందించారు. బ్రేకప్ అయితే అబ్బాయిలే ఎక్కువగా బాధపడతారు, అమ్మాయిల కంటే వారే త్వరగా కోలుకోలేరు అని చాలా ప్రచారం జరుగుతోంది. కానీ, నా వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం అందులో చాలా తప్పుంది. ఆ విషయం నేను ఖండిస్తున్నాను అని రష్మిక చెప్పారు.
గడ్డం పెంచలేం, మందు తాగలేం..
అమ్మాయిల బాధను వ్యక్తపరిచే విధానం గురించి మాట్లాడుతూ రష్మిక కొన్ని సెటైర్లు పేల్చారు. మా బాధను బయటకు చూపించడానికి మేము గడ్డం పెంచలేము, అబ్బాయిల్లా మందు తాగలేము అని వ్యంగ్యంగా అన్నారు. అయితే, లోలోపల అమ్మాయిలకే బాధ చాలా ఎక్కువగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు. లవ్ ఫెయిల్యూర్ అయితే, మా గుండె పగిలిపోతుంది" అని ఎమోషనల్గా చెప్పిన రష్మిక, ఆ బాధను తాము బయటకు చూపించబోమని తెలిపారు. అమ్మాయిలు తమ బాధను తమలోనే దాచుకుంటారని, అందుకే వారి బాధ ఎక్కువ కాలం ఉంటుందని రష్మిక వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు యువత, ముఖ్యంగా అమ్మాయిల దృష్టిని ఆకర్షించాయి.
'ది గర్ల్ఫ్రెండ్' ప్రమోషన్స్లో బిజీ
రష్మిక ప్రస్తుతం తన రాబోయే చిత్రం 'ది గర్ల్ఫ్రెండ్' ప్రచార కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటున్నారు. ప్రముఖ నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మికకు జోడీగా దీక్షిత్ శెట్టి నటిస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 7న విడుదల కానుంది. బ్రేకప్ విషయాన్ని ఇంత పర్సనల్గా, ఎమోషనల్గా ప్రస్తావించడం ద్వారా, 'ది గర్ల్ఫ్రెండ్' సినిమాలో ఆమె పాత్రకు , కథాంశానికి ఈ అంశం ఎంత కీలకంగా ఉంటుందో అనే ఆసక్తిని రష్మిక మరింత పెంచారు. తెరపై ఆమె లవ్ ఫెయిల్యూర్ కథను ఎలా పండించిందో చూడాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి చూడాల్సిందే.