
- ఇప్పటికే ప్రకటించిన మారుతి, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, మరికొన్ని కంపెనీలు
న్యూఢిల్లీ : మారుతి సుజుకీ, మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్, మరికొన్ని కంపెనీల కార్లు ఖరీదుగా మారనున్నాయి. ఇన్ఫ్లేషన్ ఎక్కువ కావడంతో ముడిసరుకుల ధరలు పెరిగాయని, అందుకే బండ్ల రేట్లను పెంచుతున్నామని ఈ కంపెనీలు చెబుతున్నాయి. మారుతి సుజుకీ కిందటేడాది ఏప్రిల్లో చివరి సారిగా కార్ల రేట్లను 0.8 శాతం పెంచింది. ఈ నెలలో మరో రౌండ్ పెంపు ఉంటుందని గతంలో పేర్కొంది. టాటా మోటార్స్ కూడా జనవరి నుంచే బండ్ల రేట్లను పెంచుతామని ప్రకటించగా, ఎంత మేర పెంచుతామనేది బయట పెట్టలేదు.
ఈ కంపెనీ తన ఎలక్ట్రిక్ కార్ల రేట్లను కూడా పెంచనుంది. ఆడి తన కార్ల రేట్లను 2 శాతం వరకు పెంచాలని చూస్తోంది. ఈ నెల నుంచి ఇది అమల్లోకి రానుంది. మహీంద్రా తన ఎస్యూవీలపై రేట్లు పెంచనుంది. హ్యుందాయ్, ఎంజీ మోటార్ కూడా బండ్ల రేట్లను పెంచే ఆలోచనలో ఉన్నాయి. బీఎండబ్ల్యూ, ఫోక్స్వ్యాగన్, స్కోడా, మెర్సిడెజ్ బెంజ్, వోల్వో, నిస్సాన్, హోండా కార్ల ధరలు ఈ నెల నుంచే పెరిగే అవకాశం ఉంది. ఈ కంపెనీలు 2–3 శాతం మేర ధరలు పెంచనున్నాయి.