
మొగుళ్లపల్లి,వెలుగు: భూమి పట్టా చేసి ఇస్తానని రైతు నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులో ఒకరిపై కేసు నమోదైంది. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ ఐ అశోక్ కథనం ప్రకారం.. మొగుళ్లపల్లి మండలం మోట్లపల్లి గ్రామానికి చెందిన రైతు గజ్జి ఐలయ్య దగ్గర 5 గుంటల భూమిని ఏడేండ్ల కింద అదే మండలంలోని చింతలపల్లికి చెందిన లడే తిరుపతి రూ. 2.65 లక్షలకు కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు.
కాగా.. ఆ భూమి ఆన్ లైన్ రికార్డుల్లో తన పేరు మీద ఉందని రైతు ఐలయ్యను అదే గ్రామానికి చెందిన దుర్గం సురేశ్ బెదిరించాడు. ఆ భూమిని పట్టా చేసి ఇస్తానని నమ్మించి రూ. 87,500 వసూలు చేశాడు. పట్టా విషయమై పలుమార్లు సురేశ్ ను రైతు ఆడిగినా పట్టించుకోలేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సురేశ్ పై కేసు నమోదు చేశారు. అలాగే సురేశ్పై ఇప్పటికే పలు కేసులు నమోదై కోర్టులో విచారణలో ఉన్నాయి. సురేశ్ కొన్నేండ్లుగా ఆన్ లైన్ పేపర్లలో పని చేస్తూ మొగుళ్లపల్లి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ నని చెప్పుకుంటూ పలువురిని మోసగించినట్టు తెలిసింది.