ఎంజీఎం, వెలుగు : ఎంజీఎం అనస్థీసియా విభాగం డాక్టర్లపై ఐపీసీ 304 సెక్షన్ కింద కేసు నమోదైంది. గత ఆదివారం జిల్లాలోని కన్నారావుపేటకు చెందిన నిహాన్(8) ఆడుకుంటూ కిందపడిపోగా కుడి చేయి విరిగింది. దీంతో బాలుడిని ఎంజీఎంకు తీసుకురాగా సర్జరీ చేయాలని చెప్పారు. అయితే ఆపరేషన్ చేయడానికి ముందు మత్తు మందు ఇవ్వగా కొద్దిసేపటికే నిహాన్ చనిపోయాడు. ఈ ఘటన ఆ రోజు ఉద్రిక్తతకు దారి తీయగా దవాఖానా ఉన్నతాధికారులు, పోలీసులు బాధ్యులపై చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఈ నేపథ్యంలో మత్తుమందు ఇచ్చిన అనస్థీసియా డాక్టర్ శ్యాంకుమార్తో పాటు మరో ఇద్దరు డాక్టర్లపై మట్టేవాడ పోలీస్ స్టేషన్లో 304 సెక్షన్కింద కేసు నమోదు చేశారు. అలాగే అనస్థీసియా విభాగాధిపతి నాగార్జున రెడ్డిపై కూడా చీఫ్ సెక్రెటరీకి సూపరింటెండెంట్ ఫిర్యాదు చేశారు. మత్తు మందు ఇచ్చేప్పుడు నాగార్జునరెడ్డి ఎంజీఎంలో లేడని, అతడి ప్రైవేటు దవాఖానాలో ఉన్నాడని తెలుస్తోంది.