కరీంనగర్  జిల్లా కొత్తపల్లి పోలీస్​స్టేషన్​లో.. అఘోరీ శ్రీనివాస్​పై కేసు నమోదు

కరీంనగర్  జిల్లా కొత్తపల్లి పోలీస్​స్టేషన్​లో.. అఘోరీ శ్రీనివాస్​పై కేసు నమోదు

కొత్తపల్లి, వెలుగు: హిందూ సనాతన ధర్మం పేరుతో తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాల వద్ద హల్​చల్  చేసిన అఘోరీ శ్రీనివాస్​పై కరీంనగర్​ కమిషనరేట్​ పరిధిలోని కొత్తపల్లి పోలీస్​స్టేషన్​లో రేప్​ కేసు నమోదైంది. నిత్యం ఏదో ఒక విషయమై వార్తల్లోకెక్కిన మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం కుశ్నపల్లికి చెందిన ఎల్లారి శ్రీనివాస్​ వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.  గతేడాది నవంబర్  21న కరీంనగర్  కమిషనరేట్  పరిధిలోని కొత్తపల్లి మండలానికి చెందిన ఓ మహిళను ట్రాప్  చేసి కిడ్నాప్  చేయడంతో పాటు అత్యాచారానికి పాల్పడ్డాడని, జగిత్యాల జిల్లా కొండగట్టుకు తీసుకెళ్లి తాళి కట్టాడని కేసు నమోదుచేశారు.

ఆ తర్వాత బాధితురాలి నుంచి రూ.3 లక్షలు వసూలు చేసిన నిందితుడు ఈ విషయం బయటకు చెబితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించాడు. బాధితురాలికి ఫోన్  ద్వారా పరిచయమైన శ్రీనివాస్  మొదట సనాతన ధర్మం గురించి చెబుతూ ఆమెను ట్రాప్  చేసినట్లు పోలీసులు ఎఫ్ఐఆర్​లో పేర్కొన్నారు. కొత్తపల్లి పోలీసులకు అఘోరీ శ్రీనివాస్​పై ఏప్రిల్ 28న బాధితురాలు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై క్రైం నంబర్ 201/2025, సెక్షన్ 64(1), 87, 318(4), 351(2) బీఎన్ఎస్​ యాక్ట్​ కింద కేసు నమోదు చేశారు.