తప్పుడు ప్రచారం చేస్తే కేసులు.. మధ్యప్రదేశ్ ​తరహా చట్టంతీసుకొస్తం: పీసీసీ చీఫ్​ మహేశ్​

తప్పుడు ప్రచారం చేస్తే కేసులు.. మధ్యప్రదేశ్ ​తరహా చట్టంతీసుకొస్తం: పీసీసీ చీఫ్​ మహేశ్​

నిజామాబాద్, వెలుగు: సోషల్​ మీడియాలో అసత్య ప్రచారం చేసేవారిపై సైబర్ ​క్రైం కింద కేసులు పెడ్తామని పీసీసీ చీఫ్​ మహేశ్ ​కుమార్ ​గౌడ్​ హెచ్చరించారు. ఇందుకోసం రాష్ట్రంలో మధ్యప్రదేశ్​తరహా చట్టాన్ని  తెస్తామని చెప్పారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని తెలిపారు. ఆమె చేసిన కామెంట్స్​లో  తల, తోక తీసేసి సోషల్​ మీడియాలో మరోరకంగా ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

వారిపై కంప్లయింట్​ చేస్తామని చెప్పారు.  శనివారం  నిజామాబాద్​ ఆర్​అండ్​బీ గెస్ట్​ హౌస్​లో మహేశ్ ​కుమార్ ​గౌడ్​ మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రంలో ముఖ్యమంత్రి మార్పు ఉండబోదని క్లారిటీ ఇచ్చారు. ప్రతిపక్షాల కావాలని దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు.  యువనేతగా బృహత్తర కార్యక్రమాలతో చక్కని పాలన అందిస్తున్న సీఎంను మార్చాల్సిన అవసరం ఏముందని మహేశ్ కుమార్​ గౌడ్​ నిలదీశారు.  

మంత్రులందరి మధ్య సఖ్యత ఉందని, ఎవరి నడుమ  ఎలాంటి విభేదాలు లేవని తెలిపారు.  ‘‘ఎలక్షన్​ టైంలో ప్రజలకిచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తూ మా ప్రభుత్వం ముందుకెళ్తున్నది. ప్రజల పట్ల మేం పూర్తి బాధ్యతతో ఉంటున్నాం. మాకులేని సమస్య బీఆర్ఎస్​, బీజేపీకి ఎందుకో అర్థంకాదు” అని వ్యాఖ్యానించారు. 

త్వరలోనే మంత్రివర్గ విస్తరణ 

ఈ నెలాఖరున లేదంటే  జూన్​ మొదటి వారంలో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు అవకాశముందని మహేశ్​ కుమార్​ గౌడ్​ తెలిపారు. ‘‘మంత్రి పదవుల కోసం కాంగ్రెస్​లో ఆశావహుల సంఖ్య ఎక్కువగా ఉంది. కూర్పులో సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.  పార్టీ హైకమాండ్​ ఈ పనిలోనే ఉంది. ఇప్పటికే లేటైనందున త్వరగా విస్తరణ జరిగితే బాగుంటుందని పీసీసీ ప్రెసిడెంట్ గా నా అభిప్రాయం చెప్పిన. 

హైకమాండ్​ అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నా” అని తెలిపారు. అలాగే, ఈ నెల26,27   తేదీల్లో  పీసీసీ కార్యవర్గం ఖరారయ్యే చాన్స్​ ఉందని ​తెలిపారు.  ‘‘కాంగ్రెస్​ పార్టీ రోజువారీ కార్యక్రమాల పరిశీలనకు పొలిటికల్​ అఫైర్స్​ కమిటీ వేయబోతున్నం. సీనియర్లకు సముచిత స్థానం కల్పిస్తూ సలహా మండలి కమిటీ ఏర్పాటు కాబోతున్నది” అని తెలిపారు.   

బీఆర్ఎస్​లో మూడు ముక్కలాట..

రాష్ట్రంలో బీఆర్ఎస్​ పనైపోయిందని మహేశ్​గౌడ్​ ఎద్దేవా చేశారు. ఆ పార్టీలో కేటీఆర్​, కవిత, హరీశ్​​రావు మధ్య ఆధిపత్యం పోరు నడుస్తున్నదని, ఇది మూడు ముక్కలాటను తలపిస్తున్నదన్నారు. ఇవన్నీ తెలిసే కేసీఆర్​ ఫాంహౌస్​ నుంచి బయటకు రావడంలేదన్నారు. ‘‘బీఆర్ఎస్​కు ప్రజలతో బంధం తెగిపోయింది. మళ్లీ అధికారం అనేది ఆ పార్టీకి కలగానే మిగులుతుంది.  

బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటే. అలాంటిది బీఆర్ఎస్​ కాంగ్రెస్​లో కలుస్తుందని బీజేపీ ఫ్లోర్​ లీడర్​ మహేశ్వర్​రెడ్డి కామెంట్​ చేయడం హాస్యాస్పదం’’ అని పేర్కొన్నారు. అద్భుత స్కీమ్స్​తో తెలంగాణను తాము దేశానికి రోల్‌మోడల్​గా మారుస్తున్నామని చెప్పారు. ఆపరేషన్​ సిందూర్​ పేరిట పాకిస్తాన్​తో యుద్ధం చేసి ఏం సాధించాం? ఏం కోల్పో యాం? అనేదానిపై కేంద్ర సర్కారు క్లారిటీ ఇవ్వడంలేదని విమర్శించారు. రైతు కమిషన్​ సభ్యుడు గడుగు గంగాధర్​, నుడా చైర్మన్​ కేశవేణు తదితరులు ఉన్నారు.