- 9 ఏళ్ల కనిష్టానికి చేరిక
న్యూఢిల్లీ: స్టార్టప్లను డబ్బు సమస్యలు వెంటాడుతున్నాయి. ఫండింగ్ దొరకడం చాలా కష్టంగా మారుతోంది. వీటిలో పెట్టుబడులు ఈ ఏడాది ఏప్రిల్లో తొమ్మిదేళ్ల కనిష్టానికి పడిపోయాయంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో వీటికి బిజినెస్లను కొనసాగించడం కష్టంగా మారుతోంది. ఉద్యోగులను తీసేస్తున్నాయి. ఏప్రిల్ నెలలో ఇండియన్ స్టార్టప్లలో ఏంజిల్ ఇన్వెస్ట్మెంట్స్, వెంచర్ క్యాపిటల్ ఫండింగ్ విలువ 381 మిలియన్ డాలర్లు ఉంది. 2014 తరువాత ఇన్వెస్ట్మెంట్లు ఇంతలా పడిపోవడం ఇదే మొదటిసారి. అదే సంవత్సరం ఏప్రిల్లో ఏకంగా 108 మిలియన్ డాలర్ల విలువైన 50 డీల్స్పై సంతకాలు జరిగాయని రీసెర్చ్ సంస్థ వీసీ సర్కిల్ తెలిపింది. వడ్డీ రేట్లు పెరుగుతుండటం, ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు ఇబ్బందుల్లో ఉండటం, స్టాక్మార్కెట్లలో ఆటుపోట్లు, టెక్నాలజీ స్టాక్స్లో కరెక్షన్ వంటి వాటి వల్ల స్టార్టప్లకు ఫండింగ్ తగ్గిపోతోంది. అంతేగాక స్టార్టప్ల వాల్యుయేషన్ మరీ ఎక్కువగా ఉన్నాయనే ఆందోళనల కారణంగా ఇన్వెస్టర్లు వీటిలో డబ్బు పెట్టడానికి ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు. వాల్యుయేషన్ సమస్యల కారణంగానే చాలా మంది స్టార్టప్లకు దూరంగా ఉంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్లో రోజుకు సగటును 1.9 డీల్స్పై సంతకాలు జరిగాయి. 2015 తరువాత అత్యంత తక్కువ డీల్స్ఉన్నది ఈసారి ఏప్రిల్లోనే! 2022 ఏప్రిల్ స్టార్టప్లు 3.3 బిలియన్ డాలర్ల విలువైన 146 డీల్స్ను కుదుర్చుకున్నాయి. ఈసారి ఏప్రిల్ఫండింగ్ ఇందులో సగం కూడా లేదు. ప్రస్తుత సంవత్సరం మార్చిలో 1.1 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందాలు పూర్తయ్యాయి. ఫిబ్రవరిలో వీటి విలువ 482 మిలియన్ డాలర్లు ఉంది.
2021లో మస్తు ఇన్వెస్ట్మెంట్లు
వెంచర్ క్యాపిటల్, ప్రైవేట్ ఈక్విటీ ఇన్వెస్టర్లు స్థానిక కంపెనీలకు బిలియన్ల కొద్దీ డాలర్లను అందజేయడంతో స్టార్టప్ ఫండింగ్ కార్యకలాపాలు 2021లో పుంజుకున్నాయి. అదే సంవత్సరంలో యునికార్న్ల సంఖ్య (బిలియన్ డాలర్లు లేదా అంతకంటే ఎక్కువ విలువ కలిగిన స్టార్టప్లు) సెంచరీ మైలురాయిని చేరుకుంది. అయితే, స్టాక్ మార్కెట్లలో కరెక్షన్, సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచడంతో స్టార్టప్ ఫండింగ్ కార్యకలాపాలపై ఎఫెక్ట్ పడింది. ఎక్కువ వాల్యుయేషన్ల గురించి ఇన్వెస్టర్లలో ఆందోళనలు తలెత్తాయి. గ్లోబల్ మార్కెట్లు పుంజుకునే వరకు మార్కెట్బేరిష్గానే ఉండొచ్చని మైక్రో వెంచర్ క్యాపిటల్ సంస్థ అప్స్పార్క్స్ క్యాపిటల్ పార్ట్నర్ మహ్మద్ ఫరాజ్ అన్నారు. ఇన్వెస్ట్మెంట్ల విషయంలో కంపెనీలు ఆచితూచి అడుగేస్తున్నాయని అన్నారు. ఫండింగ్ దొరకడం కష్టంగా మారుతుండటంతో స్టార్టప్లు పొదుపును పెంచుతున్నాయి. ఈ–కామర్స్ ప్లాట్ఫారమ్ మీషో ఇటీవల 251 మంది ఉద్యోగులను తీసేసింది. ఒక ఏడాదిలో ఇది మూడుసార్లు లేఆఫ్లు ప్రకటించింది. ఆన్లైన్ మాథ్స్ ట్యూటరింగ్ ప్లాట్ఫారమ్ క్యూమ్యాథ్ కూడా 100 మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది.
