
బీహార్లో తొలి విడత కులాల వారీగా జనాభా లెక్కల సేకరణ జనవరి 7 నుంచి 21 వరకు నిర్వహించారు. మొదట రాష్ట్రంలోని ఇళ్లు, కుటుంబాల వివరాలు సేకరించారు. మార్చిలో జరిగే రెండో విడతలో అన్నివర్గాల ప్రజలు, వారి కులాలు, ఉపకులాలు, మతాలు, ఆర్థిక పరిస్థితులు, వృత్తుల వివరాలు నమోదు చేస్తారు. ముఖ్యంగా ఓబీసీల స్థితిగతులను ఇందులో ప్రధానంగా ప్రస్తావించనున్నారు. ఈ ప్రక్రియను మొబైల్ అప్లికేషన్ యాప్లో జరుగుతుంది. ఈ ప్రాజెక్టును నితీశ్కుమార్ ప్రభుత్వం రూ.500కోట్లతో చేపట్టింది. మే 31 వరకు సర్వే ప్రక్రియ మొత్తం పూర్తవుతుందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. బడుగు, బలహీన వర్గాలకు శాస్త్రీయ విధానంలో సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే కులాల లెక్కలు పక్కాగా ఉండాలన్న ఉద్దేశంతో బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్ ఈ ప్రక్రియను ప్రారంభించారు.
దేశంలో మొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వం 1871లో కులగణన చేపట్టింది. 1931లో చివరిసారిగా కులగణన చేశారు. ఈ జనాభా గణాంకాల ప్రాతిపదికగానే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు కల్పించారు. ఆ తర్వాత 1990ల్లో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఓబీసీలకూ రిజర్వేషన్ విస్తరించింది. పదేళ్లకు ఒక్కసారి చేసే జనాభా లెక్కింపులో ఎస్సీ, ఎస్టీల డేటా సేకరణకు మాత్రమే పరిమితమయ్యారు.