సీబీఐ కస్టడీకి కవిత

సీబీఐ కస్టడీకి కవిత

న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్ స్కామ్​లో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను 3 రోజుల పాటు సీబీఐ కస్టడీకి రౌస్ ఎవెన్యూలోని స్పెషల్​ కోర్టు అప్పగించింది. తనను సీబీఐ ప్రశ్నించడాన్ని, అరెస్టు చేయడాన్ని సవాల్​ చేస్తూ కవిత దాఖలు చేసిన 2 పిటిషన్లను కొట్టివేసింది. సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ఆమెను కస్టడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కవితను ఢిల్లీలోని సీబీఐ హెడ్ క్వార్టర్స్ కు అధికారులు తరలించారు. కస్టడీ రిపోర్టులో సీబీఐ పలు కీలక​విషయాలను ప్రస్తావించారు. లిక్కర్​ స్కామ్​లో కవిత కింగ్​ పిన్​ అని, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​తో కలిసి ఆమె కుట్ర పన్నారని పేర్కొంది. 

విచారణకు సహకరించడం లేదు : సీబీఐ

లిక్కర్ స్కామ్​మనీలాండరింగ్ కేసులో గత నెల 15న హైదరాబాద్​లో కవితను అరెస్టు చేసిన ఈడీ అధికారులు కోర్టు అనుమతితో కొన్నిరోజులు కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించారు. అనంతరం జ్యుడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉన్న ఆమెను.. గురువారం మధ్యాహ్నం సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు స్పెషల్ కోర్టులో హాజరుపరిచారు. కవితకు వ్యతిరేకంగా సహ నిందితులు ఇచ్చిన వాంగ్మూలాలు, వాట్సప్ చాట్స్, ఇతర ఆధారాలను కోర్టుకు సమర్పించారు. ఆధారాలపై గంటన్నరకు పైగా వాదనలు సాగాయి. సీబీఐ తరఫు సీనియర్ అడ్వకేట్ పంకజ్ కుమార్ వాదనలు వినిపిస్తూ.. లిక్కర్ స్కామ్​లో కవిత కింగ్ పిన్​గా వ్యహరించారని, సూత్రధారితో పాటు పాత్రధారిగా ఉన్నారని అన్నారు.

ఆప్ నేతలకు రూ. 100 కోట్లు సమకూర్చడంతో పాటు.. తమకు అనుకూలంగా లిక్కర్ పాలసీని రూపొందించుకోవడంలో కవిత కీలక పాత్ర పోషించారని వివరించారు. ఈ కేసు దర్యాప్తులో సహ నిందితుల వాంగ్మూలాలు నమోదు చేసినట్లు తెలిపారు. అప్రూవర్లుగా మారిన వారితో పాటు కవిత సన్నిహితులు అభిషేక్ బోయినపల్లి, మాజీ ఆడిటర్ బుచ్చిబాబు, ఇతరులు కవిత పాత్రపై కీలక సమాచారం ఇచ్చారని పేర్కొన్నారు. ఈ సమాచారంపై కవితను ప్రశ్నించగా.. తప్పించుకునేలా సమాధానాలు ఇస్తున్నారని కోర్టుకు తెలిపారు. అందుకే ట్రయల్ కోర్టు అనుమతితో తీహార్ జైల్లోనే అరెస్ట్ చేసినట్లు చెప్పారు. కాగా, తీహార్ జైల్లో కవితను ఈ నెల 6న సీబీఐ విచారించడం, అరెస్టు చేయడంపై ఆమె తరఫు అడ్వకేట్లు విక్రమ్ చౌదరి వర్చువల్ మోడ్​లో..

నితీష్ రాణా, మోహిత్ రావు కోర్టు హాల్​లో అభ్యంతరం తెలిపారు. సీబీఐ ప్రశ్నించడం, అరెస్ట్ చేయడంపై తాము దాఖ లు చేసిన పిటిషన్లపై విచారించాలని కోర్టును కోరారు. ఇందుకు అనుమతించిన స్పెషల్ జడ్జి కావేరి బవేజా మధ్యాహ్నం 2 గంటలకు విచారణను వాయిదా వేశారు. అనంతరం విచారణ ప్రారంభం కాగా.. ప్రతివాది కవిత, ఆమె తరపు న్యాయవాదులైన తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా అక్రమంగా సీబీఐ వ్యవహరించిందని అడ్వకేట్​ విక్రమ్ చౌదరి వాదించారు. అనంతరం తీర్పును రిజర్వ్​ చేసిన జడ్జి.. సాయంత్రం 4.10 గంటలకు కవితను సీబీఐ కస్టడీకి అప్పగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీచేశారు. 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సీబీఐ కోరగా.. 3 రోజులు ఇచ్చారు. ఈ నెల 14 వరకు కస్టడీకి అప్పగించిన కోర్టు.. 15న ఉదయం 10 గంటలకు తిరిగి కవితను కోర్టులో హాజరుపరచాలని ఆదేశించింది. 

కవిత పిటిషన్లు కొట్టివేత

తీహార్ జైల్లో తనను సీబీఐ ప్రశ్నించడం, అరెస్టు చేయ డాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన 2 పిటిషన్లను కోర్టు తోసిపుచ్చింది. శుక్రవారం కోర్టులో విచారణలో భాగంగా.. ఒకే కేసులో అరెస్ట్ అయి కస్టడీలో ఉన్న వ్యక్తిని మరో కేసులో ఎలా అరెస్ట్ చేస్తారని ఆమె తరఫు అడ్వకేట్లు వాదించారు. కవిత అరెస్ట్​కు చూపుతున్న కారణాలన్ని పాతవని, కొత్తగా అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదన్నారు. సమాచారం ఇవ్వకుండా అరెస్టు చేశారని, ఇది అక్రమమని వాదించారు. జోక్యం చేసుకున్న జడ్జి కావేరి బవేజా.. కవిత అరెస్ట్ పై సీబీఐ తమ ముందు అప్లికేషన్ దాఖలు చేసిందని, ఆ అప్లికేషన్ ను పరిగణనలోకి తీసుకొని అరెస్ట్​కు అనుమతించినట్లు పేర్కొన్నారు. అది తమ పరిధిలోని అంశమని

అందుకే అప్రాప్రియేటెడ్ ఆర్డర్స్ పాస్ చేసినట్లు తెలిపారు. కోర్టునే ప్రశ్నించేలా కౌంటర్ దాఖలు చేయొద్దని కవిత తరఫు అడ్వకేట్లపై అసంతృప్తి వ్యక్తం చేశారు.  కవితను సీబీఐ అరెస్ట్ చేయడం అక్రమం కాదని పేర్కొన్నారు. కవిత దాఖలు చేసిన పిటిషన్లపై రిప్లై ఇవ్వాలా వద్దా? అనేది సీబీఐ నిర్ణయం అని అభిప్రాయపడ్డారు. సీబీఐ తరఫు అడ్వకేట్​ పంకజ్ కుమార్ వాదిస్తూ.. నిబంధనలను అతిక్రమించలేదన్నారు. ఇరువైపు వాదనలు విన్న ధర్మాసనం... కవిత దాఖలు చేసిన రెండు పిటిషన్లను కొట్టివేస్తున్నట్లు ప్రకటించారు. 

అరెస్ట్​పై కోర్టులో మాట్లాడిన కవిత 

నిబంధనల మేరకే కవితను అరెస్ట్ చేశామన్న సీబీఐ వాదనలపై కోర్టులో కవిత రెస్పాండ్ అయ్యారు. ‘‘బుధవారం రాత్రి 10.30 గంటలకు సీబీఐ నన్ను అరెస్ట్ చేసే అవకాశం ఉందని హింట్ ​అందింది. గురువారం ఉదయం సీబీఐ నన్ను అరెస్ట్ చేసింది. ఈ అరెస్ట్​పై న్యాయ సలహా కోసం మా అడ్వకేట్లతో మాట్లాడాల్సి ఉందని చెప్తే సీబీఐ అధికారులు అనుమతించలేదు. నా భర్తకు ఫోన్​లో సమాచారం ఇచ్చేందుకు మాత్రమే అనుమతించారు” అని ఆమె పేర్కొన్నారు. 

హోంఫుడ్, బుక్స్​కు ఓకే

సీబీఐ కస్టడీలో కవితకు కోర్టు పలు వెలుసుబాట్లు కల్పించింది. ఆమె కోరిన మేరకు హోంఫుడ్, జపమాల, బట్టలు, మ్యాట్రిస్, బెడ్​షీట్, పిల్లో, టవల్స్​కు పర్మిషన్ ఇచ్చింది. అలాగే ‘ది ప్యారాడాక్సికల్ ప్రైమ్ మినిస్టర్, ఎలన్ మాస్క్, ది నట్ మెగ్స్ కర్స్, రెబేలా అగేనెస్ట్ ది రాజ్, రోమన్ స్టోరీస్’ అనే పుస్తకాలకు అనుమతిచ్చింది. అలాగే కస్టడీలో ఉన్నన్ని రోజులు సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య అరగంట పాటు కవిత లాయర్ మోహిత్​తో మాట్లాడేందుకు ఓకే చెప్పింది.

అలాగే ఇదే టైం మధ్యలో  భర్త అనిల్, అన్న కేటీఆర్, పీఏ శరత్ 15 నిమిషాలు కలిసేందుకు పర్మిషన్ ఇచ్చింది. హోం ఫుడ్ అందించేందుకు విద్యానిధి పరంకుశానికి అనుమతిస్తూ ఉత్తర్వుల్లో వారి పేర్లను పొందుపరించింది. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం.. కవితను సీసీటీవీ కెమెరాల పర్యావేక్షలో విచారించాలని సీబీఐకి సూచిస్తూ ఆర్డర్ కాపీని కోర్టు వెలువరించింది.