ఎస్ఎల్బీసీ టన్నెల్లో జియోమాగ్నటిక్ సర్వే

ఎస్ఎల్బీసీ టన్నెల్లో జియోమాగ్నటిక్ సర్వే
  •     ఎన్​జీఆర్​ఐ నేతృత్వంలో హెలికాప్టర్​ ద్వారా నిర్వహణ
  •     నేడు ప్రారంభించనున్న సీఎం రేవంత్​, మంత్రి ఉత్తమ్​
  •     భూమి లోపలి షియర్​ జోన్లను గుర్తించేందుకు వీలుగా స్టడీ
  •     దాదాపు 200 కి.మీ. పరిధిలో సర్వే చేయనున్న ఇరిగేషన్​ శాఖ

హైదరాబాద్​, వెలుగు: ఎస్​ఎల్బీసీ టన్నెల్​ పనులను పునరుద్ధరించేందుకు ప్రభుత్వం కసరత్తును ముమ్మరం చేసింది. సోమవారం నుంచి ఎస్​ఎల్బీసీ పనుల కోసం హెలికాప్టర్​ ఆధారిత జియోమాగ్నటిక్​ సర్వేను నిర్వహించనుంది. దీన్ని సీఎం రేవంత్​ రెడ్డి, ఇరిగేషన్​ శాఖ మంత్రి ఉత్తమ్​ కుమార్​ రెడ్డి ప్రారంభించనున్నారు. మొత్తం 43.93 కిలోమీటర్ల టన్నెల్​లో భాగంగా ఇప్పటికే శ్రీశైలం ఇన్​లెట్​ నుంచి 13.94 కిలోమీటర్లు, ఔట్​లెట్​ (దేవరకొండ) నుంచి 20.4 కిలోమీటర్ల మేర తవ్వారు. 

మరో 9.8 కిలోమీటర్ల మేర టన్నెల్​ను తవ్వాల్సి ఉంది. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరి 22న అనుకోని ప్రమాదంతో 8 మంది సిబ్బంది చనిపోయారు. టన్నెల్​ పైకప్పు కూలిపోవడంతో దాదాపు 2.5 కిలోమీటర్ల మేర వరద నిండింది. అప్పట్నుంచి పనులు జరగడం లేదు. టన్నెల్​లో డొల్లలాగా మారడంతో టన్నెల్​ బోరింగ్​ మెషీన్​ (టీబీఎం)తో పనిచేసే అవకాశం లేకుండా పోయింది. దీంతో టీబీఎంతో కాకుండా డ్రిల్లింగ్​ అండ్​ బ్లాస్టింగ్​ పద్ధతిలో టన్నెల్​ను తవ్వాలని నిర్ణయించారు. 

అందుకు తగ్గట్టు నేషనల్​ జియోఫిజికల్​ రీసెర్చ్​ ఇన్​స్టిట్యూట్​ (ఎన్​జీఆర్​ఐ)తో హెలికాప్టర్​ ద్వారా జియోమాగ్నటిక్​ సర్వే చేయించనున్నారు. సర్వేలో భాగంగా మొత్తం 200 కి.మీ మేర హెలికాప్టర్​తో సర్వే చేస్తారు. 24 మీటర్ల వ్యాసం కలిగిన మాగ్నటిక్​ లూప్​తో భూమిలోపల ఏముందో తెలుసుకుంటారు. ఈ లూప్​ ద్వారా భూమిలోకి ఎలక్ట్రో మాగ్నటిక్​ సిగ్నల్స్​ను పంపించి.. భూమికి 800 మీటర్ల నుంచి కిలోమీటర్​ వరకున్న లోపలి పొరల్లోని లోపాలకు సంబంధించి నమోదయ్యే రీడింగ్స్​ను నమోదు చేస్తారు. వాటి ఆధారంగా షియర్​ జోన్​ ప్రాంతాలు ఎక్కడున్నాయో అంచనా వేస్తారు. దాని ప్రకారమే టన్నెల్​ తవ్వకం పనులను ముందుకు తీసుకెళ్తారు. 

ఆడిట్లను కట్టేందుకూ అనుకూలించని ప్రాంతం

టన్నెల్​ను రిజర్వ్​ ఫారెస్ట్​ నుంచి తవ్వాల్సి రావడంతో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. క్వార్ట్జ్​ స్టోన్​, భారీ బండలను తవ్వుకుంటూ టన్నెల్​ను నిర్మించాల్సి ఉంది. 15 నాలాలు (చిన్న చిన్న ప్రవాహాలు), నాలుగు వాగుల గుండా టన్నెల్​ వెళ్తున్నది. అడవులు, ఇతర సాంకేతిక కారణాల వల్ల సైడ్​ యాక్సెస్​ షాఫ్ట్​లు, ఆడిట్లను నిర్మించేందుకూ అనువుగా లేదు. దీంతో రెండు వైపులా టీబీఎం ద్వారా పనులు చేశారు. 

ఇప్పుడు అనుకోని ప్రమాదంతో టన్నెల్​ లోపలే టీబీఎం కూరుకుపోవడంతో.. డ్రిల్లింగ్​ బ్లాస్టింగ్​ పద్ధతిలో టన్నెల్​ను తవ్వనున్నారు. 2009లో వచ్చిన వరదలతో టన్నెల్​ పనులు ఆగిపోగా.. ఇప్పటి వరకు నెలకు కేవలం 75 మీటర్ల చొప్పున తవ్వకాలే జరిగాయి. అయితే, కాంగ్రెస్​ ప్రభుత్వం 2028 జూన్​లోపు టన్నెల్​ పనులను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నది. ఇది పూర్తయితే.. ప్రపంచంలోనే అతి పొడవైన నీటిపారుదల సొరంగంగా రికార్డులకు ఎక్కనుంది.

 కాగా, ఎస్​ఎల్బీసీ టన్నెల్​ పనుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిపుణులను తీసుకొచ్చింది. ఇప్పటికే ఇరిగేషన్​ శాఖకు గౌరవ సలహాదారుగా లెఫ్టినెంట్​ జనరల్​ (ఇండియన్​ ఆర్మీ మాజీ ఈఎన్​సీ) హర్​పాల్​ సింగ్​ను నియమించింది. టన్నెల్​ స్పెషలిస్ట్​ అయిన కల్నల్​ పరీక్షిత్​ మెహ్రాను స్పెషల్​ అడ్వైజర్​గా అపాయింట్​ చేసింది. వాళ్ల ఆధ్వర్యంలో టన్నెల్​ పనులను త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్​గా పెట్టుకున్నది. 

నేడు మన్నెవారిపల్లెకు సీఎం

నాగర్​కర్నూల్, వెలుగు: ఎస్​ఎల్బీసీ టన్నెల్​ జియోమాగ్నటిక్​ సర్వేను సీఎం రేవంత్​రెడ్డి సోమవారం ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మన్నెవారిపల్లె ఎస్ఎల్బీసీ టన్నెల్​ ఔట్​లెట్​ దగ్గర అధికారులతో ఆయన రివ్యూ నిర్వహిస్తారు. ఇందులో మంత్రులు ఉత్తమ్​కుమార్​ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి, ఈఎన్సీలు, సీఈలు, డీఎల్ఐ ఇంజనీర్లు పాల్గొననున్నారు.