సీబీఐ, ఈడీ చీఫ్ పదవీ కాలం పొడిగింపు

సీబీఐ, ఈడీ చీఫ్ పదవీ కాలం పొడిగింపు

కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని కేంద్ర దర్యాప్తు సంస్థలైన సీబీఐ.. ఈడీ చీఫ్ పదవీ కాలాన్ని ఐదేండ్ల వరకు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. సీబీఐ, ఈడీ డైరెక్టర్‌ల పదవీ కాలం ప్రస్తుతం రెండేండ్లు. దీనిని ఐదేండ్లకు కేంద్రం పొడిగించింది. ఈ మేరకు ఆర్డినెన్స్‌ కూడా జారీ చేసింది. ఇప్పటివరకు ఉన్న రెండేళ్ల పదవీకాలం సమయంలో వారిపై ఎలాంటి ఆరోపణలు వచ్చిన
వారిని తొలగించేందుకు ఆస్కారం ఉండేది కాదు. 

అయితే వీరి పదవీకాలం ముగిసిన తర్వాత పనితీరు బాగుందని అనిపిస్తే.. కేంద్ర ప్రభుత్వం మరికొంత కాలం వారిని పొడిగించేందుకు ఆస్కారం ఉండేది. అయితే తాజాగా తీసుకొచ్చిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఆర్డినెన్స్ 2021 ప్రకారం ఒక ఏడాది పాటు పొడిగించేందుకు వీలుంటుంది.  ‘సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ పదవి నియామకంపై తొలుత ఉన్న వ్యవధిని, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, క్లాజ్(ఎ) కింద కమిటీ సిఫార్సుపై, రాతపూర్వకంగా కారణం నమోదు మేరకు ఒక్కసారికి ఒక్క ఏడాది వరకు పొడిగించవచ్చు’ అని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సవరణ) ఆర్డినెన్స్ 2021లో కేంద్రం పేర్కొంది. 

అయితే ప్రాథమిక నియామకంలో పేర్కొన్న వ్యవధితో సహా మొత్తం ఐదు సంవత్సరాల వ్యవధి పూర్తయిన తర్వాత అటువంటి పొడిగింపుకు అవకాశం లేదని ఆ ఆర్డినెన్స్‌లో కేంద్రం స్పష్టం చేసింది. తాజాగా జారీ చేసిన ఈరెండు ఆర్డినెన్స్‌లపై  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం కూడా చేశారు. అయితే 1997 కంటే ముందు సీబీఐ డైరెక్టర్ పదవీ కాలం నిర్దిష్టంగా పేర్కొన లేదు. ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం ఏ సమయంలోనైనా వీరిని తొలగించే అధికారం కలిగి ఉండేది. 

‘2018లో బాధ్యతలు స్వీకరించిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చీఫ్ ఎస్‌కే మిశ్రా పదవీకాలం పొడిగింపుతో ముడిపడి ఉన్న కేసులో జస్టిస్ ఎల్‌ఎన్ రావు నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది, పదవీకాలం పొడిగింపు “అరుదైన మరియు అసాధారణమైన సందర్భంలో మాత్రమే చేయాలని’ అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్, "డిపార్ట్‌మెంట్ ఆఫ్ రెవెన్యూ, ఫైనాన్స్ మినిస్ట్రీ కింద ఉన్న ప్రత్యేక ఆర్థిక దర్యాప్తు సంస్థ", విదేశీ మారకపు చట్టాలు మరియు నిబంధనలు మరియు మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసులను ఈడీ పరిశోధిస్తుంది. మరోవైపు ఇప్పటికే మోదీ సర్కార్‌పై విమర్శలు వస్తున్నాయి. కేంద్ర దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తుందని కేంద్ర సర్కార్‌పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అగ్రనేతలు, మాజీ మంత్రులను లక్ష్యంగా చేసుకుని దర్యాప్తు కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తుందని ప్రతిపక్షాలు గతంలో ఆరోపించాయి. మరి ఇలాంటి సమయంలో మోదీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.